కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 17 : 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు హిందీ కవి గుల్జార్ ఎంపికవడంపై కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత వారాల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన జీవితంలో సాహిత్యంలో చేసిన సేవలను గుర్తించి జ్ఞాన్పీఠ్ అవార్డు కమిటీ ఈ అవార్డును ప్రకటించిందన్నారు. ఆయన హిందీలో రచించిన ‘గ్రీన్ పోయమ్స్’ను తెలుగులో తాను ‘ఆకుపచ్చ కవితలు’గా అనువదించడం వల్లే తనకు కేంద్ర సాహిత్య పురస్కారం పురస్కారం లభించిందన్నారు.
గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, సినీ దర్శకుడు అని, ఆయన రచనలు, సినిమాలు, గజల్స్ అన్నీ సృజనాత్మకంగా, తాత్వికంగా ఉంటాయన్నారు. ఆయన కవిత చదివే పద్ధతి శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుందని, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న ఒక లెజెండ్ అని కొనియాడారు. ఈ పురస్కారం తెలుగులో సినారె, విశ్వనాథ సత్యనారాయణ, రావూరి భరద్వాజ్ ముగ్గురికి వచ్చిందన్నారు.