ధర్మారం, జనవరి 14: ప్రేమించి పెద్దలను ఒప్పించి తాను పెండ్లి చేసుకున్న యువతి ప్రసవ సమయంలో శిశువుతో సహా మృతిచెందగా, భార్య లేని లోకంలో ఉండలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పండుగపూట ధర్మారం మండలం పత్తిపాక విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాకకు చెందిన భూర్ల విజయలక్ష్మీ, రాజయ్య దంపతులకు కూతురు, కొడుకు. కూతురుకు గతంలోనే వివాహం కాగా, కొడుకు నరేశ్ డిగ్రీ దాకా చదువుకున్నాడు. నాలుగేండ్లుగా కరీంనగర్లోని ఓ మెడికల్ షాప్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మౌనిక అనే యువతిని నరేశ్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి మూడేండ్ల కింద వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి కరీంనగర్లోనే ఉంటున్నాడు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని విషాదం నెలకొన్నది. మూడు నెలల క్రితం ప్రసవ సమయంలో శిశువుతోపాటు మౌనిక కూడా మృతిచెందగా, అప్పటి నుంచి నరేశ్(26) మనోవేదన చెందుతున్నాడు.
ఉద్యోగం మానేసి మానేసి స్వగ్రామం పత్తిపాకలోనే ఉంటున్నాడు. మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తండ్రి రాజయ్య వ్యవసాయ పనులకు వెళ్లగా తల్లి విజయలక్ష్మీ ఇంటి ముందు కూర్చుని ఉంది. దీంతో నరేశ్ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఉరేసుకున్నాడు. గమనించిన తల్లి చుట్టు పక్కలవారి సాయంతో తలుపులు తీయించి కొన ఊపిరితో ఉన్న నరేశ్ను కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నరేశ్ మృతి చెందినట్లు తెలిపారు. కాగా, తమ ఒక్కగానొక్క కొడుకు పండుగరోజు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి రాజయ్య ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.