కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 30: పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బండి సంజయ్ మాజీ ఎంపీ వినోద్కుమార్పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు జక్కుల నాగరాజు మండిపడ్డారు. నగరంలోని మాజీ ఎంపీ వినోద్కుమార్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బండి సంజయ్కి ఓటమి భయంతో నిద్ర కూడా పట్టడం లేదని, పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు కూడా తెలియని ఏకైక ఎంపీ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు మత రాజకీయాలతో హైదరాబాద్కే పరిమితమయ్యారని, ప్రజలు ఛీకొడుతున్నారని మళ్లీ ఇప్పుడు మత రాజకీయాలు మొదలు పెట్టారని విమర్శించారు. వినోద్కుమార్ గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, కరీంనగర్కు స్మార్ట్సిటీ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన మాట తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మధుసూదన్రెడ్డి, భూక్యా తిరుపతినాయక్, తిరుపతి, రాజు, సాయికృష్ణ, జశ్వంత్, సత్తినేని శ్రీనివాస్, జీఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.