మెట్పల్లి రూరల్, మార్చి 21 : ‘కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలతో భవిష్యత్ అంధకారం అవుతుందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. ఓ పార్టీ హిందూత్వమే జెండాగా, మరోపార్టీ ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెడుతూ ఓట్లు దండుకునేందుకు సిద్ధమయ్యాయని విమర్శించారు.
ఆ రెండు పార్టీలకు తప్పుడు ప్రచారాలు, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడమే తెలుసని, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో, కోరుట్ల పట్టణంలో వేర్వేరుగా జరిగిన పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశాలకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు.
రాష్ట్రంలో పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితిలో రేవంత్ సర్కారు ఉందని విమర్శించారు. కేంద్రంలో పదేళ్లు పాలించిన బీజేపీ సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని, ఎన్నికలు రాగానే ఓట్లు దండుకునేందుకు హిందూత్వాన్ని ఎజెండాగా మార్చుకుందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నానని, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే విజయం మనదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్, ముఖ్య నాయకులు రాణవేని సత్యనారాయణ, ఒజ్జెల బుచ్చిరెడ్డి, కొమిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో ఉన్న వారే హిందువులన్న రీతిలో ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. మతం ముసుగులో ప్రజలను రెచ్చగొట్టడమే సిద్ధాంతంగా పెట్టుకున్నది. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నయి. ఇలాంటి అసమర్థులను నమ్మి మళ్లీ ఓటేస్తే అంధకారమే మిగులుతుంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
ఎంపీ ధర్మపురి అర్వింద్ బీసీ నినాదంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నడు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉంటే ఎందుకు ఆదుకోవడం లేదు? దళితులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దాడులను ఎందుకు ఖండించడంలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోయినయి. బీఆర్ఎస్ నాయకులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా కలసికట్టుగా పని చేసి నిజామాబాద్లో గులాబీ జెండా ఎగురవేద్దాం. నిఖార్సైన కార్యకర్తలెప్పుడూ పార్టీని విడిచి వెళ్లరు. స్వార్థపరులే పార్టీలు మారుతరు.
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే