పెద్దపల్లి, జనవరి 16(నమస్తే తెలంగాణ): ‘గత ఎన్నికల్లో అసత్యాలను ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పదవుల నుంచి దించి గద్దెనెక్కేందుకు ఆ పార్టీ నాయకులు ఎత్తులు వేస్తున్నరు. ఏవో ఆశలు చూపి, ప్రలోభ పెడుతున్నరు’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ నాయకుల కుట్రలను తిప్పికొట్టాలని, బలమైన నాయకులుగా మన సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లిలోని రాఘవాపూర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఆచరణకు సాధ్యం కాని హమీలు, అనేక రకాల మోసపూరిత వాగ్దానాలతో ఎమ్మెల్యేలుగా గెలిచారని విమర్శించారు. అయినా తాము ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తున్నామని చెప్పారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు మరో కుట్రకు తెరలేపారని, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పదవుల నుంచి దించేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్లో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టి పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జిల్లాలో పరిస్థితులను మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వివరించామని, ఆయన ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులకు తామంతా భరోసా ఇస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఉద్యమ నాయకులే నేడు ప్రజాప్రతిధులుగా ఉన్నారని, అలాంటి బీఆర్ఎస్ నాయకులను దింపే కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. ప్రజాస్వామ్యంలో పదవుల నుంచి దింపే అప్రజాస్వామిక కుట్రలు సరి కాదని హితవు పలికారు. పార్టీ బీఫాంలపై గెలిచిన వారందరికీ విప్ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే వారంలోపే వారి పదవి పోతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు పాల రామారావు, జడ్పీటీసీలు గంట రాములు, ఆముల నారాయణ, తగరం సుమలత శంకర్లాల్, పుస్కూరి పద్మజ జితేందర్రావు, బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ ఉన్నారు.