సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై వేంకటేశ్వర స్వామి ఊరేగింపు
ఘనంగా సహస్రదీపాలంకరణ, ఊంజల్ సేవ
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 8: నగరంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల నిర్వాహకుడు, మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయంలో ఉదయం వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తూ ఆలయ మాడ వీధుల్లో విహరించారు. సాయంత్రం స్వామి వారికి సహస్రదీపాలంకరణ, ఊంజల్ సేవ నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులతో పాటు మేయర్ వై సునీల్రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల కమిటీ సభ్యుడు, టీఈఐఏ జిల్లా అధ్యక్షుడు గోగుల ప్రసాద్ నేతృత్వంలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో గీతా సంచార్ సత్సంగ్, సుందర్ సత్సంగ్ భజన, సూర్యనారాయణ-మాధవి బృందం సంకీర్తనలు, రాధిక భక్తి సంగీతం, కట్ట సిస్టర్స్ కీర్తనలు, శివప్రియ మాధవి సంగీతం, రాధాకృష్ణ శిష్య బృందం భక్తి జానపద నృత్యాలు, జిల్లా బాల భవన్ పిల్లల భక్తి కీర్తనలు, నృత్యాలు, నాగరాణి హరికథ భక్తులను అలరించాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు ఎదురోలు ఉత్సవం నిర్వహించనున్నారు.