కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 12: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. బుధవారం అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యే వేడుకలు, ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనుండగా, ఆలయ ప్రా ంగణమంతా సుందరంగా ముస్తాబైంది. ఎనిమిదో రోజు శోభాయాత్ర కనులపండువగా సాగనుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆలయ ఈవో ఉడుతల వెంకన్న, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవా ల కరపత్రం ఆవిష్కరించారు.
ఇప్పటికే ఆల య పరిసరాలన్నీ ముస్తాబు చేయడంతోపాటు నగరంలోని పలు వీధులు, ప్రధాన చౌరస్తాలు వేంకటేశ్వరస్వామి లైటింగ్, బ్రహ్మోత్సవాలను ప్రతిబింబించే నమూనాలలో తీర్చిదిద్దారు. ఇందులో గతేడాది మాదిరే స్వామి వారి క ల్యాణం, పుష్పాభిషేకం, చక్రస్నానం కోసం అమరవీరుల స్తూపం వరకు వేదికను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర దేవస్థానాలకు భిన్నంగా ఏకశిలపై వెలసిన మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామికి ఎంతో ప్రాశస్థ్యం ఉన్నది. 150 ఏళ్ల పురాతన ఆలయంగా.. చరిత్రకు సాక్షంగా నిలుస్తున్నది.
ఈనెల 14న సాయంత్రం అధ్యయనోత్సవాలతో వేడుకలు ప్రారంభమవుతాయి, 15న బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, పుట్టమన్ను తీసుకురావడం, సహస్ర కళశాభిషేకం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, ధ్వజాదివాసం, సాయంత్రం శేషవాహన సేవ ఉంటాయి. 16న గోమాత పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ఉదయం సూర్యప్రభ వాహన సే వ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ ఉంటాయి. 17న నిత్యహోమం, పూర్ణాహుతి, కల్పవృక్ష వాహన సేవ, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సారె సమర్పణ, సాయంత్రం అశ్వవాహన సేవ, గణవాహన సేవ ఉంటా యి.
ఆ తర్వాత ప్రకాశం గంజ్లోని వరసిద్ధి వినాయక మండపం నుంచి ఎదుర్కోళ్ల ఉత్స వం ఉంటుంది. 18న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నారాయణుల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయం త్రం ‘గరుడ వాహన సేవ’ ఉంటుంది. 19న సుప్రభాత సేవ, అన్నకూటోత్సవం, తిరుమల తిరుపతి వేద పండితులచే నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణం, సింహవాహన సేవ, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, హనుమత్ వాహన సేవ ఉంటాయి. 20న మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నా నం, సాయంత్రం పుష్పయాగం, ధ్వజారోహ ణం, ఏకాంత సేవ ఉంటాయి. 21న సా యంత్రం మార్ఫెడ్ గ్రౌండ్ నుంచి ‘శోభాయత్ర’ తో ఉత్సవాలు ముగుస్తాయి.
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నం. దేవాదాయశాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.
-ఉడుతల వెంకన్న, కార్యనిర్వహణాధికారి
బ్రహ్మోత్సవాలకు సకల సౌకర్యాలతో ఏర్పాట్లు చేశాం. 14న అధ్యయనోత్సవాలతో వేడుకలు ప్రారంభమై, 21న శోభాయాత్రతో ముగుస్తాయి. ఆలయంలో ప్రతి రోజూ దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశాం. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.
– చకిలం శ్రీనివాస్, వ్యవస్థాపక ధర్మకర్త
14న సాయంత్రం ఆలయంలో చాగంటి కోటేశ్వర్రావు ప్రవచనాలు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం స్వామి వారి వాహన సేవ, సినీ నేపథ్య గాయకులతో భక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి.
– చకిలం గంగాధర్, వ్యవస్థాపక ధర్మకర్త