కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 2: కుల వివక్షకు వ్యతిరేకంగా బోయినపల్లి వెంకటరామారావు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కీర్తించారు. కరీంనగర్లోని బొవెరా భవన్లో శుక్రవారం వెంకటరామారావు కుమారుడు హనుమంతారావు ఆధ్వర్యంలో బొవెరా శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మేయర్ సునీల్రావుతో కలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేశారు. వేడుకల లోగో, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ కులవివక్ష కొనసాగడం బాధాకరమన్నారు.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ దళితులపై దాడుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని విమర్శించారు. కులవివక్షను రూపుమాపినప్పుడే బొవెరా ఆశయాలను నెరవేర్చినవారమవుతామన్నారు. నగరంలో ఆయన విగ్రహం, ఐలాండ్ ఏర్పాటుకు తనవంతు సహకరిస్తానని చెప్పారు. మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, బొవెరా జబ్బకు సంచి వేసుకొని పేదల సమస్యలను ఎలుగెత్తి చాటారని కొనియాడారు. బొవేరా తనయుడు హనుమంతారావు స్వాగతోపాన్యసం చేస్తూ, శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా అవధానాలు, కవి సమ్మేళనాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ముగింపు కార్యక్రమం హైదరాబాద్లో ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ గాయకుడు వరంగల్ శ్రీనివాస్కు బొవెరా పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. రూ.10,016 నగదుతోపాటు శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. వరంగల్ శ్రీనివాస్ బొవెరాపై పాడిన పాటలకు అందరూ చప్పట్లతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కావూరి శ్రీనివాస్ శర్మ, డాక్టర్ పాలెపు సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం వెంకయ్య, మాడిశెటి గోపాల్నడిమెట్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
అన్ని వర్గాలను ఏకం చేసి అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన గొప్పవ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు. తెలంగాణలో కవిత్వమే లేదు.. కవులే లేరు అనే కాలంలో తెలంగాణ భారతి పత్రిక ద్వారా ఇక్కడి ప్రజల ఆకాంక్షను ఎలుగెత్తి చాటారన్నారు. దేశ విభజన తర్వాత జరిగిన పరిణామాలను తన వ్యాసాలలో వివరించారన్నారు. కానీ, ఆయన చేసిన పోరాటాలు, గ్రామ స్వరాజ్యం, సర్వే జనః సుఖినోభవంతు అనే భావజాలం ఎక్కడ పోయిందన్నారు.