ఇల్లందకుంట(జమ్మికుంట)/ ఫర్టిలైజర్సిటీ, జూన్ 30: బిజిగిరిషరీఫ్ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు వచ్చిన ఇద్దరు యువకులు స్నానానికి కోనేరుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. మృతులిద్దరూ గోదావరిఖని వాసులు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన 12 మంది యువకులు గురువారం రాత్రి దర్గాకు వచ్చారు. దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు వెళ్లేందుకు గుట్టపైనున్న కోనేరు వద్దకు చేరుకున్నారు. అందులో స్నానానికి దిగారు.
స్నానం చేసి 12 మందిలో 10 మంది కోనేరు నుంచి బయటికి రాగా, ఇద్దరు కోనేరులో చిక్కుకుపోయారు. వారిని కాపాడడం కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగి బయటకు తీసేలోపే వారు మృతి చెందారు. మృతులు గోదావరిఖనిలోని జ్యోతినగర్కు చెందిన అయిందాల శ్రీనాథ్ (19), విఠల్నగర్కు చెందిన పొలంపల్లి సాయికుమార్ (24)గా గుర్తించారు. సాయికుమార్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కాగా, శ్రీనాథ్ ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృదేహాలను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ చెప్పారు.