జ్యోతినగర్, ఆగస్టు 21: మీ పాత ఫోన్లు అమ్ముతున్నారా..? డబ్బులు వస్తున్నాయని ఆశపడి మీ పనికిరాని ఫోన్ను విక్రయిస్తున్నారా..? అయితే జాగ్రత్త! ఇలా అమ్మడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉండవచ్చు! ఎందుకంటారా..? అయితే చదవండి.. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బిహార్కు చెందిన కొందరు వ్యక్తులు పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న సమాచారం మేరకు రామగుండం సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో కృష్ణమూర్తి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు.
ఆ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలాం, మొహమ్మద్ ఇఫ్తికార్, అఖ్తర్ అలీని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. వారంతా బీహార్లోని హతియా దియారాకు చెందినవారుగా గుర్తించి, వారి నుంచి ఐదు సంచుల్లో 4వేల పాత ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఫోన్లను తమ సహచర వ్యక్తికి అమ్మితే, అతను జార్ఘండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తాడని విచారణలో ఒప్పుకొన్నారు. వారు ఫోన్లకు మరమ్మతులు చేసి, సైబర్ మెసాలకు పాల్పడుతారని తెలిపారు. దీంతో ఫోన్ ఐఎంఈఐ నంబర్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదమున్నదని, అలాగే మీ డాటా రికవరీ చేసి బ్లాక్మెయిల్ చేసే ముప్పు ఉన్నదని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా పాత ఫోన్లను విక్రయించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి పడితే వారికి విక్రయించవద్దని సూచించారు.