CP Amber Kishore Jha | సుల్తానాబాద్ రూరల్, మే 15 : బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ను రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. వివరాలు నమోదు రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రత చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ప్రతీ వాహనం, పశువుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలనీ, సంబంధిత పత్రాలు పరిశీలించాలని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్, సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.