మెట్పల్లి రూరల్, డిసెంబర్ 8: నాడు సంస్థానంగా కొనసాగిన బండలింగాపూర్, నేడు మండల కేంద్రంగా అవతరించబోతున్నది. జగిత్యాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఇబ్రహీంపట్నం మండలంలో కొనసాగిన బండలింగాపూర్, జిల్లాల పునర్విభజనలో మెట్పల్లి మండలంలో కలిసింది. అప్పటి నుంచి గ్రామాన్ని ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొంత కాలం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడమే కాదు, రిలే నిరాహారదీక్షలు, మానవహారాలతో తమ వాణిని బలంగా వినిపించారు. ఈనేపథ్యంలో జగిత్యాలకు వచ్చిన సీఎం కేసీఆర్, బహిరంగ సభలో బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పా టు చేస్తానంటూ అనూహ్య ప్రకటన చేయడంతో గ్రామస్తులు సంబురాలు జరుపుకొంటున్నారు.
నాడు సంస్థాన కేంద్రంగా పాలన..
నాడు బండలింగాపూర్ గ్రామం కరీంనగర్ పూర్వ జిల్లాలోనే అతిపెద్ద సంస్థానంగా కొనసాగింది. రాజా అనంతకిషన్రావు ఆధీనంలో సంస్థాన కేంద్రంగా పరిపాలన జరిగేది. సంస్థానం కింద సత్తక్కపల్లి, రాజేశ్వర్రావుపేట, అమ్మక్కపేట, కిషన్రావుపల్లె, రాయికల్, అయిలాపూర్, మైతాపూర్, మెట్లచిట్టాపూర్, జగ్గసాగర్, రామలచ్చక్కపేట, ఆత్మకూర్ తదితర గ్రామాలు ఉండేవి. కాలక్రమేణా గడీల వ్యవస్థ కనుమరుగు కావడంతో గ్రామంగా మిగిలిపోయింది. అలాగే 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న గడి కూడా కనుమరుగైంది. సంస్థానానికి గుర్తుగా కేవలం గడి ప్రధాన ద్వారం మాత్రమే మిగిలి ఉంటుంది.
మేజర్ పంచాయతీ
మెట్పల్లి మండలంలో 5,922 జనాభాతో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్లో 2,929 పురుషులు, 2,993 మహిళలు ఉన్నారు. మొత్తం 4,343 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 2,039, మహిళలు 2,304 ఉన్నారు. గ్రామంలో మొత్తం 14 వార్డులున్నాయి. గ్రామ విస్తీర్ణం 3,500 ఎకరాలు కాగా, మూడు చెరువులు, మూడు కుంటలున్నాయి.
నాడు కేసీఆర్ పల్లెనిద్ర
కేసీఆర్ 2009 సెప్టెంబర్లో బండలింగాపూర్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి ఇక్కడే రాత్రి బస కూడా చేశారు. గ్రామస్తులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా జగిత్యాల సభలో ఈ జ్ఞాపకాలను కేసీఆర్ నెమరేసుకున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో కలిసి బండలింగాపూర్లో పల్లెనిద్ర చేశానని, అప్పుడు ఎమ్మెల్యే పారని కాలువలు, ఎండిన చెరువులు చూపిస్తూ బాధపడ్డారని గుర్తు చేశారు. ఆ ఊరి ప్రజలు మండలం కావాలని అడిగారని.. వెంటనే బండలింగాపూర్ మండలాన్ని మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ రుణం తీర్చుకుంటం
మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు బండలింగాపూర్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మా గ్రామంలో చేసిన పల్లెనిద్రను నెమరువేసుకుంటూ మండల కేంద్రంగా ప్రకటించినందుకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు చెబుతున్న. అలాగే ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు మద్దతుగా ఉంటూ, ఆయన సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్త.
– జంగిటి అంజయ్య, సర్పంచ్ (బండలింగాపూర్)
గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతయ్
మా గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయనుండడంతో పాలన మరింత సౌలభ్యంగా మారుతుంది. బండలింగాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతయ్. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వెళ్లే వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు మరింత సౌలభ్యంగా ఉండనుంది. మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు కృతజ్ఞతలు.
– పోతుగంటి రాజేందర్, వైస్ ఎంపీపీ (బండలింగాపూర్)
సంతోషంగా ఉన్నది..
బండలింగాపూర్ మండల కేంద్రం కావాలన్న మా కల సీఎం ప్రకటనతో నెరవేరుతున్నది. ప్రస్తుతం రైతులు భూ సమస్యలు, వ్యవసాయ సూచనలు, రాయితీల కోసం మెట్పల్లికి వెళ్తున్నరు. ఇకపై స్థానికంగానే పొందేందుకు వీలు కలుగనుంది. బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. సీఎం, ఎమ్మెల్యేలకు రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
– నేరెళ్ల శంకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ (బండలింగాపూర్)