మెట్పల్లి, జనవరి 6: ఆటో డ్రైవర్లు కదంతొక్కారు. కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీలో ఫ్రీజర్నీ కల్పించి తమ బతుకులను రోడ్డుపాలు చేసిందంటూ రోడ్డెక్కారు. శనివారం మెట్పల్లిలో నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా బిక్షాటన చేస్తూ తహసీల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. రోడ్డుపై భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు.
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆటోలకు ఈఎంఐలు కట్టేపరిస్థితి లేదని వాపోయారు. తాము బతుకుడు కష్టంగా ఉన్నదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు శివలాల్ నాయక్, కార్యదర్శి రంగు సంపత్, నాయకులు గణేశ్, రామయ్య, గంగాధర్, శంకర్, గట్టయ్య, నవాబ్, నర్సయ్య, రవి, గంగాధర్, సంతోష్, రాజు, వసంత్, గంగాధర్, పాషా, షఫీ, లక్ష్మణ్, మొగిలి, నరేందర్, ఐలయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.