జ్యోతినగర్, డిసెంబర్ 19: స్వరాష్ట్రంలోనే జర్నలిస్టులకు న్యాయం జరిగిందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకున్నదని తెలిపారు. వ్యాధి బారినపడ్డ వారికి ఆర్థికంగా చేయూతనందించిందని చెప్పారు. తెలంగాణ అస్థిత్వ పోరాటంలో టీయూడబ్ల్యూజే కీలక భూమిక పోషించిందని పేర్కొన్నారు. సోమవారం ఎన్టీపీసీ టీవీ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే హెచ్ 143) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం కలిగిన టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు సానుకూలంగా ఉన్నదన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల కోసం ప్రభుత్వం 17 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
హెల్త్కార్డుల విషయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి యూనియన్ నాయకులు జర్నలిస్టులందరికీ సింగరేణి క్వార్టర్లు కేటాయించాలని కోరగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అల్లం నారాయణ తెలిపారు. అనంతరం ఆయనను యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బిజిగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్, రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధానకార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నరేంద్రాచారి, కార్యదర్శి ఏ రవీందర్రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు అంకరి ప్రకాశ్, నాయిని మధునయ్య, తగరపు శంకర్, విలాసాగర్ శ్రీనివాస్, ముచ్చకుర్తి కుమారస్వామి, రామ్శంకర్, సిరిమల్ల మధు, పాతిపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు
ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని సమైక్యపాలకులు పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. కరోనా, ఇతర కారణాలతో మరణించిన సమయాల్లో కుటుంబాలకు భరోసా కల్పించారు. సర్కారు ఐదేండ్ల వరకు పింఛన్, లక్ష పరిహారమిస్తున్నది. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా.
– రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి