DSC | మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడంతో అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి. పోస్టులు పెద్ద సంఖ్యలో ఉంటాయని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ మెగా డీఎస్సీకి ప్రమోషన్ల ప్రక్రియ అడ్డుపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగోన్నతులు పూర్తి కావాలంటే.. టెట్ విధిగా నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు కల్పించపోతే.. పోస్టుల ఖాళీలు పెరిగే అవకాశాలు లేకపోగా, ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జనవరి 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, బదిలీలు నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు గతేడాది సెప్టెంబర్ 3న షెడ్యూల్ విడుదల చేసింది. ఆ ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 3 వరకు కొనసాగాల్సి ఉన్నది. నిజానికి ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు గత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా ప్రమోషన్లు వస్తాయని ఆశించారు.
అప్పటి అంచనాల మేరకు దాదాపు 1200 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు వచ్చేవి. అలాగే ల్వాంగేజ్ పండితులు, పీఈటీలకు సైతం ప్రమోషన్లు వచ్చేవి. కానీ, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత సాధించిన వారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రమోషన్లు పొందేందుకు టెట్ ఉత్తీర్ణత సాధించిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గతేడాది సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
నిజానికి కేసీఆర్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు వరకు ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించింది. అందులో భాగంగా డీఎస్సీ నిర్వహించేందుకు రాష్ట్రంలో 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో చూస్తే 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండిట్లు, 164 వ్యాయామ ఉపాధ్యాయులు, 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో 393 పోస్టులకు ఇచ్చింది. అందులో 125 ఎస్ఏలు, 176 ఎస్జీటీలు, భాషా పండితులు 72, 20 పీఈటీ పోస్టులు ఉన్నట్టు చూపింది. జిల్లాల వారీగా చూస్తే.. కరీంనగర్ జిల్లాలో 99, జగిత్యాల జిల్లాలో 148, పెద్దపల్లి జిల్లాలో 43, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 103 పోస్టులు ఉన్నట్టు ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లోనే ఎన్నికలు రావడంతో డీఎస్సీ నిలిచిపోయింది. కాగా, ప్రస్తుతం మెగా డీఎస్సీ నిర్వహించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకోసం ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అయితే, మెగా డీఎస్సీ అంటే పోస్టులు ఎక్కువగా ఉంటాయని సహజంగానే అందరూ భావిస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే, అడ్డంకులను అధిగమిస్తే తప్ప అదనంగా ఖాళీలు ఏర్పడే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉన్నది. దీని కోసం ఇప్పటికే టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు పోరాడుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం చూసినా, ఎన్సీటీఈ ఆదేశాల పరంగా చూసినా.. టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికే మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలని ఉందని, ఆ నిబంధనలను విస్మరించకుండా పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సదరు టీచర్లు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే పరిష్కారం అంతా సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఇది పరిష్కారమైతేనే ఉమ్మడి జిల్లాలో అదనంగా పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు న్యాయ పరమైన చిక్కులు, అడ్డంకులను అధిగమించి పదోన్నతులు ఇవ్వగలిగితే.. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 1200 ఎస్జీటీలకు ఉద్యోగోన్నతులు వచ్చే అవకాశమున్నది. లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీల పరిస్థితి కూడా ఇదే. డిమాండ్లు పరిష్కారమైతే వాటన్నింటినీ కొత్తగా ఖాళీలుగా చూపడానికి ఆస్కారముంటుంది. ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తిచేస్తే.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండితులు కలిపి సుమారు 1200 నుంచి 1500 వరకు కొత్తగా ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది.
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం వరకు బాగానే ఉన్నా.. ఈ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. కొత్తగా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతోపాటు సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయుల్లోనూ టెన్షన్ కొనసాగుతున్నది. టెట్ అర్హత తప్పనిసరని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యే అవకాశమున్నది. ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహిస్తామంటే.. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. టెట్ నిర్వహించకుండా పదోన్నతులకు వెళ్తే టెట్ అర్హత సాధించిన టీచర్లు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై మాత్రం అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతున్నది.