రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (నమస్తే తెలంగాణ) :సిరిసిల్లరూరల్/ రుద్రంగి/ ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట/బోయినపల్లి : ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాల్టీల నుంచి 1,56,150 మంది శిబిరాలకు వచ్చి 1,38,350 దరఖాస్తులు సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫారాలను అధికారులు, సిబ్బంది స్వయంగా తీసుకుంటున్నారు. అన్ని మండలాలు, గ్రామాల్లో స్థానిక సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.