Kamanpur | కమాన్పూర్, ఆగస్టు 8 : హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో ఆనంది 21వ జాతీయ యువ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. పంజాబ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది.
కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి భారతి-శంకర్ దంపతుల రెండో కుమార్తె ఆనంది ప్రస్తుతం కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గతంలోనూ జాతీయ, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించిన ఆమె, తాజాగా రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి మరోసారి సత్తా చాటింది. ఆనంది జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో కమాన్పూర్ మండల ప్రజలు, కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, కమాన్పూర్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.