సంప్రదాయ సాగుతో విసుగు చెందిన రైతు రాజయ్య, మూస పద్ధతులకు స్వస్తి పలికాడు. రెండెకరాల్లో కూరగాయల సాగుకు సిద్ధమై, సేంద్రియ విధానంలో తీరొక్క రకం పండిస్తున్నాడు. తాజా కూరగాయలు, పూలు విక్రయిస్తూ మూడు నెలల్లోనే అంచనాలకు మించి దిగుబడి సాధించాడు. లక్ష రాబడి రావడంతో సంతోష పడుతున్నాడు.
– ఓదెల, డిసెంబర్ 1
ఓదెలకు చెందిన రాజయ్య సంప్రదాయ సాగుతో విసిగిపోయాడు. ఆశించిన దిగుబడి రాక నిరాశకు గురయ్యాడు. పెట్టుబడి సైతం చేతికందకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఇగ మూస ధోరణిని మానేశాడు. సేంద్రియ విధానంలో కూరగాయల సాగుకు ఉపక్రమించాడు. తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఎకరాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఒకేచోట కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, మెంతులు, ఉల్లితోపాటు ఆకు కూరలు, టమాట, బెండ, చిక్కుడు, బీర, వంకాయ, పాలకూర, తోటకూర, కాకర, బోడకాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, సొరకాయ, బంతి పూల సాగు చేశాడు. ఇందుకు 50 వేలదాకా పెట్టాడు.
క్రమం తప్పకుండా నీరు పెట్టడం, సేంద్రియ ఎరువులు వాడడంతో మూడు నెలలు తిరగకముందే కూరగాయల చెట్లు విరగ్గాయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అన్ని రకాల తాజా కూరగాయలను వార సంతల్లో అమ్ముతున్నాడు. అలాగే ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఆది, బుధవారం జాతరల సమయంలో విక్రయిస్తున్నాడు. శుభకార్యాలు, పండుగల వేళ వెజిటేబుల్స్తోపాటు బంతిపూలు అమ్ముతున్నాడు. రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నానని, ఊరూరా వారసంతలు తిరుగుతూ తాజా కూరగాయలను తక్కువ ధరకే అమ్ముతున్నానని రాజయ్య అంటున్నాడు. మంచి లాభాలు వస్తున్నాయని, మరో నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నానని సంతోషంగా చెబుతున్నాడు.