కలెక్టరేట్/మానకొండూర్, నవంబర్ 27: జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా నగరంలోని కోతిరాంపూర్, మానకొండూర్లోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను పరిశీలించారు.
అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్యవంతం చేయాలన్నారు. అలాగే, 17 ఏళ్లు నిండిన వారు కూడా ముందస్తుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో అర్హులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. దివ్యాంగులు, లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
ఫాం 6 ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఫాం 6బీ, ఫాం 7, ఫాం 8 ద్వారా ఓటరు జాబితా వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. కొత్త ఓటర్ల పేరు, వివరాలతో జాబితా తయారు చేసి, వారంతా నమోదయ్యేలా చూడాలన్నారు. మరణించిన వారి వివరాలు సేకరించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బీఎల్వోలు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, తదితర వివరాలు బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. జడ్పీ సీఈవో ప్రియాంక, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, ఎన్నికల డీటీ, మానకొండూర్ మండల సూపర్వైజర్ సమీనా, బీఎల్వోలు అబేదాబేగం, ఏ పద్మ, జే పద్మారాణి, పీ పద్మ, కనుకలక్ష్మి, స్వప్న, అరుణ, విజయ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.