వరి నారుకు కాండం తొలుచు పురుగు దాపురించింది. ఇటీవలే నాట్లు పూర్తికాగా వాతావరణ పరిస్థితులతో తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎదగక నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా కునారం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అప్రమత్తమయ్యారు. నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో రైతులు మేజర్గా వరి సాగు చేస్తారు. నెల రోజుల నుంచి యాసంగి సీజన్ వరి నాట్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమడి దశలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశలో ఉండగా, గత వారం రోజులుగా వాతావరణంలో మారిన పరిస్థితులతో కాండం తొలిచే, రెక్కల పురుగు ఆశిస్తున్నది. ఇంకా గుడ్ల సముదాయాలు కనిపిస్తున్నాయి. గత రెండేండ్లతో పోలిస్తే ఈ యేడు పిలక దశలో కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉండగా, నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్తో పాటు వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు.
నివారణ మార్గాలు..
పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘాపెట్టాలి.
పిలక దశలో ఎకరాకు 3లింగాకర్షక బుట్టలు పెట్టి, అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పని సరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రధాన పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువవుతుంది. ఈ క్రమంలో వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రాములు కార్భోఫ్యూరాన్ 3జి గుళికలు లేదా, 600 గ్రాముల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి.
ఒకవేల నారుమడిలో వేయకపోతే 15రోజుల వయస్సున్న పిలకదశలో ఉన్న వరిపైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 10కిలోలు లేదా, కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8కిలోలు లేదా, క్లోరాంట్రానిలిఫ్రోల్ 0.4జి 4కిలోలు వేయాలి.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వాదశలో వరిపైరును నష్టపరుస్తున్నట్లు తెలిసింది. అలాంటి ప్రాంతాల్లో క్వినాల్ఫాస్ 2మి.లీ, ప్రొఫెనోఫాస్ 2మి.లీ, లేదా కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2గ్రా,లు లీటరు నీటికి చొపున కలిపి పిచికారి చేయాలి
పై పద్ధతులు రైతులు పాటిస్తే కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వివరించారు.