సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. మూస పద్ధతికి స్వస్తి పలికి ఆధునిక టెక్నాలజీ వినియోగంతో వస్ర్తోత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. విపణిలో పోటీని తట్టుకోవడంతోపాటు డిమాండ్ ఉన్న కాటన్, విస్కోస్ లాంటి వస్ర్తాలను తయారు చేసేందుకు మరమగ్గాలను ఆధునికీకరించాలని టెక్స్టైల్ పార్కు అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో నయా బ్రాండ్స్ను మార్కెటింగ్ చేసేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో ఆదిత్య బిర్లా కంపెనీ సైతం ముందుకు రాగా, ప్రస్తుత సాంచాల స్థానంలో 800, వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేసే ఎయిర్జెట్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.80 కోట్లతో డీపీఆర్ సైతం రూపొందించగా, త్వరలోనే పనుల ప్రక్రియ మొదలుకాబోతున్నది.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్స్టైల్స్ రంగానికి మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలో ఉండగా, ఈ పరిశ్రమ అభివృద్ధికి చేనేత జౌళి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనేక రాయితీలు ఇచ్చి పరిశ్రమను ముందుకు తీసుకెళ్తూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేలా రూ.3 వేల కోట్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ప్రభుత్వం నుంచి ఇప్పించారు. దీంతో పరిశ్రమ రాష్ర్టానికే స్ఫూర్తిగా నిలిచింది. ఇక్కడి పరిశ్రమ స్ఫూర్తితోనే వరంగల్ జిల్లాలో ప్రభు త్వం మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయగా, అక్కడ ఆడ్వాన్స్ టెక్నాలజీతో వస్ర్తాలను ఉత్పత్తి చేస్తూ మార్కెట్తో పోటీపడుతున్నది. ఈ క్రమంలో సిరిసిల్ల పరిశ్రమలో ఆధునికంగా వస్ర్తాలు తయారు చేయాలని టెక్స్టైల్ పార్కు అసోసియేషన్ నిర్ణయించింది.
మూస పద్ధతికి స్వస్తి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పాలిస్టర్ వస్ర్తాల తయారీతో మూస పద్ధతిలో నడుస్తున్నది. డోర్ కర్టన్ల నుంచి మొదలు వివిధ వేడుకల్లో వినియోగించే (అలంకరణ) డెకరేషన్ వస్ర్తాలను తయారు చేస్తున్నది. ఇది 360 రోజుల పాటు కార్మికులకు ఉపాధి కల్పించలేకపోతున్నది. దీంతో ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్లపైనే ఆధార పడాల్సి వస్తున్నది. ఇందుకు పాతకాలపు సాంచాలే కారణమని చెప్పవచ్చు. సిరిసిల్ల పట్టణంలో సాంచాలన్నీ ఆధునీకరించబడినవే అయినప్పటికీ మారుతున్న టెక్నాలజీ ప్రకారం వాటిపై నాణ్యమైన వస్ర్తాలు తయారీకి వీలు కాకపోవడంతో పాలిస్టర్ వస్ర్తాలు, ముతక రకం తయారీ చేస్తున్నారు. ప్రస్తుతం టెక్స్టైల్ పార్కులో రేఫియర్లూంలు ఉన్నప్పటికీ అవి కూడా అడ్వాన్స్గా వచ్చిన టెక్నాలజీతో యజమానులు పోటీ పడలేక పోతున్నారు. చేసేది లేక చాలా మంది సిరిసిల్ల పట్టణం, టెక్స్టైల్ పార్కులోని సాంచాలను అమ్ముకుంటున్నారు. పార్కులోని పరిశ్రమలు నడుస్తున్నాయంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీల వల్లే అని చెప్పవచ్చు.
కేటీఆర్ చొరవతో ముందుకొచ్చిన ‘ఆదిత్య బిర్లా’
వస్త్ర ప్రపంచంలో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్నది. కొత్త కొత్త డిజైన్లతో వస్ర్తాలు ఉత్పత్తి చేస్తూ తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేస్తున్నాయి. వాటి సరసన సిరిసిల్లను నిలుపాలన్న ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఫలితంగా సిరిసిల్లలోని అప్పారెల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థలు గోకుల్దాస్ అండ్ కంపెనీ, టెక్స్పో ఇం డియా లాంటి వస్త్ర తయారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వస్త్ర ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. ఇంకా మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు ఆయన బాగా శ్రమిస్తున్నారు. ప్రపంచ విఫణిలో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టాలన్న లక్ష్యంతో కోట్లాది రూపాయల సబ్సిడీలు ప్రభు త్వం నుంచి ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇ క్కడి పరిశ్రమలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు చేయాలని పరిశ్రమ యజమానులకు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోని పరిశ్రమలను సందర్శించి అవగాహన పెంపొందించుకునేలా స్టడీ టూర్లకు పంపించా రు. ఇతర రాష్ర్టాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ఎగుమతులు చేస్తున్న పరిశ్రమల యజమానులు, మార్కెటింగ్ అధికారులను ర ప్పించి అవగాహన సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా ఆదిత్య బిర్లా సంస్థను కూడా సిరిసిల్లకు రప్పించారు. రెండు రోజుల క్రితం సిరిసిల్లను సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధులు యజమానులు, అధికారులతో సమావేశమై కొత్త తర హా డిజైన్ల తయారీపై అవగాహన కల్పించారు.
వస్త్ర పరిశ్రమలో నూతన సాంకేతిక విప్లవం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నూతన సాంకేతిక విప్లవానికి యజమానులు ముందడుగు వేస్తున్నారు. కేటీఆర్ చొరవతో ముందుకొచ్చిన ఆది త్యా బిర్లా ఇక్కడ తయారైన వస్ర్తాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ఒప్పందం చేసుకోబోతున్నందున యజమానులందరూ కలిసి రూ.80 కోట్లతో డీపీఆర్ రూపొందించారు. ప్రస్తుతం రేపియర్ లూం ద్వారా 200 మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ప్రస్తుత అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చిన ఎయిర్జెట్ లూం 800 నుంచి 1000 మీటర్ల దాకా తయారు చేస్తుంది. ఇలాంటి లూంలు కొనుగోలు చేయాలని టెక్స్టైల్స్ పార్కు అసోసియేషన్ నిర్ణయించింది. పా లిస్టర్ వస్ర్తాలకు స్వస్తి చెప్పి 100 శాతం కాటన్, విస్కోస్ లాంటి వస్ర్తాలను తయారు చేసేందుకు ముందుకు పోతున్నారు. అధునాతన సైజింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న రేపియర్ షెడ్లను తొలగించి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా విలువైన ఎయిర్జెట్లను కొనుగోలు చేసి, వాటికి అనుగుణంగా ఏసీ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిపైన తయారీ చేసిన వస్ర్తాలకు తమిళనాడు తరహాలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఆదిత్యబిర్లా యాజమాన్యం ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చింది. పరిశ్రమ ఆధునికీకరణతో వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్కులోని విజయసాయి టెక్స్టైల్స్ యూనిట్లో 8 వరకు ఎయిర్జెట్లూంలు ఏర్పాటు చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం
సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్లో ప్రస్తుతం ఉన్న రేపియ ర్ లూంలను తొలగించి వాటి స్థానంలో ఎయిర్జెట్ లూంలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందు కోసం కొంత మంది యజమానులం కలిసి రూ.80 కోట్ల తో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మంత్రి కేటీఆర్ చొరవతో ఇక్కడ తయారైన వస్ర్తాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఆదిత్య బిర్లా సంస్థ ముందుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త కొత్త డిజైన్ల తయారీతో ముందుకుపోవాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై పరిశ్రమపై చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తాం.
– అంకారపు కిరణ్కుమార్, సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కు అభివృద్ధి కమిటీ
ప్రధాన కార్యదర్శి
మంత్రి కేటీఆర్ సహకారం వల్లే..
ముతక రకం వస్ర్తాల తయారీతో మార్కెట్లో పో టీని తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వ సహకారం, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో పరిశ్ర మ నడిచింది. అమాత్యుడి సూచనల మేరకు పరిశ్రమను ఆధునికీకరించి సరికొత్త డిజైన్లతో వస్ర్తాలను తయారు చేయాలని నిర్ణయించాం. వాటికి మార్కె ట్ సౌకర్యం కల్పించేందుకు కేటీఆర్ చొరవతో ఆదిత్యా బిర్లా సంస్థ ముందు కు రావడం మాకు కొండంత భరోసానిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కాటన్, విస్కోస్ నూలు వినియోగంతో తయారైన వస్త్రాలకే బాగా డిమాం డ్ ఉంది. అలాంటి వస్త్రాల తయారీ కోసం ఎయిర్జెట్ లూంలను వంద దాకా కొనుగోలు చేస్తున్నాం.
– ఎల్లె లక్ష్మీనారాయణ, సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కు అభివృద్ధి కమిటీ
కోశాధికారి టెక్స్టైల్స్ పార్కు