LMD Police Station | తిమ్మాపూర్,మార్చి20: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో నేదునూరు సర్పంచ్ కనకం లక్ష్మీ కొమురయ్య ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నేదునూరు సర్పంచ్ కనకం లక్ష్మీకొమురయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరైనట్లు తెలిపారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతరం పలు కారణాలతో భవన నిర్మాణం ఆగిపోయిందని. ప్రస్తుత పాలకవర్గం గ్రామంలో మళ్లీ భవనం నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయించుకున్నారన్నారు.
దీనికి ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణను భూమి పూజకు స్థానిక పాలకవర్గం గురువారం ఆహ్వానించిందని, మధ్యాహ్నం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పారు. అయితే ఈ క్రమంలో పాత శిలాఫలకాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆరా తీశారని, దీంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ హడావుడిగా వెళ్లి పాత శిలాఫలకాన్ని పగలగొట్టాడని తెలిపారు. నివ్వేరపోయిన నాయకులు, అధికారులు, మహిళలు అలాగే ఉండిపోయారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో, అలాగే ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచులు ఎలుక ఆంజనేయులు, గాండ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, నాయకులు ల్యాగల వీరారెడ్డి, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, నేదునూరి శంకర్, మహేష్, మండల నాయకులు పాల్గొన్నారు.