కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ వసతి గృహం అధునాతన హంగులతో రూపుదిద్దుకున్నది. ఎమ్మెల్యే కృషితో మంజూరైన 50 లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పునర్నిర్మించగా కొత్తశోభను సంతరించుకున్నది. చూడచక్కని గదులు, తీరొక్క రంగులతో సింగారించుకున్నది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరిన గెస్ట్హౌస్ ప్రారంభానికి ముస్తాబైంది.
శిథిలావస్థకు చేరిన కోరుట్లలోని ప్రభుత్వ అతిథి గృహాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సంకల్పించారు. అధికారుల ప్రతిపాదనల మేరకు ఇటీవలే టీయూఎఫ్ఐడీసీ నిధులు 50 లక్షలు మంజూరు చేయించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు గదులు నిర్మించి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ప్రతి గదిలో వాషింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, బెడ్లు, ఫర్నిచర్, టాయిలెట్స్, గీజర్తోపాటూ ఏసీ వసతులు కల్పించారు. కొత్తగా గేట్ ఏర్పాటు చేయడంతో పాటూ గెస్ట్హౌస్ చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించారు. అల్లమయ్య గుట్టలోని ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన వసతి గృహం నుంచి పట్టణ పరిసర ప్రాంతాల అందాలను వీక్షించవచ్చు. పక్కన అయ్యప్ప, జాన సరస్వతీ మాతా ఆలయం, ఈద్గా మైదానం ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లదకర వాతావరణంలో నిర్మించిన అతిథి గృహం సరికొత్త హంగులతో దర్శనమిస్తుండడంతో పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గెస్ట్హౌస్ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు సన్నాహాలు చేస్తున్నారు.