కరీంనగర్. జూలై 27(నమస్తే తెలంగాణ) వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వరద ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారగా, చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగుల పరవళ్లతో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకుతుండగా, సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల ఉధృతితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మధ్యమానేరు) నిండుకుండలా మారింది. మొత్తంగా 1.05లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 22 గేట్లు ఎత్తి 1,10,572 క్యూసెక్కులను కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్కు తరలిస్తున్నారు. 27.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారార్ జలాశయంలో ప్రస్తుతం 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్ఎండీకి భారీగా వరద వస్తున్నది. మోయతుమ్మెద వాగు నుంచి 49వేలు, ఎస్సారార్ జలాశయం నుంచి 1.10లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా 10వ నంబర్ గేటును ఎత్తి విడుదల ప్రారంభించారు. తర్వాత 16గేట్లు ఎత్తి 56వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. 24టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీలో ప్రస్తుతం 18టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గోదావరి ఉధృతి పెరుగుతున్నది. అటు కడెం ప్రాజెక్టు, ఇటు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గంటగంటకూ ప్రవాహాన్ని పెంచుకుంటూ ఉగ్రరూపం దాల్చుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉప్పెనలా తరలివస్తున్నది. మొత్తం 7,09,404 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఇరిగేషన్ అధికారుల బృందం ఇక్కడ 40గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్కు తరలిస్తున్నారు. అక్కడా 70గేట్లు ఎత్తి వచ్చింది వచ్చినట్లే దిగువకు భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బరాజ్కు పంపిస్తున్నారు.