ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదు
కరీంనగర్ మేయర్ వై సునీల్రావు ధ్వజం
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28:‘ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టామని చెబుతున్నాడు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయేమో బీజేపీ తరఫున అభ్యర్థులే లేరని ప్రకటిస్తున్నాడు..’ ఇందులో ఏది నిజం.. ఇంతకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటలనా? లేదా బండి సంజయా? ప్రజలకు చెప్పాలని కరీంనగర్ మేయర్ సునీల్రావు నిలదీశారు. అభ్యర్థులను నిలుపలేదని కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించాయని, కానీ ఈటల ఇందుకు విరుద్ధంగా బరిలో నిలిపామని చెప్పడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ పరిణామాలు బీజేపీలో ఆదిపత్య పోరుకు అద్ధంపడుతున్నాయని చెప్పారు. ఆదివారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ తరహాలోనే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. ఈటల బీజేపీ అభ్యర్థి అని చెబుతున్న వ్యక్తి కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని కలువడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు తాను అభ్యర్థిని బరిలో నిలిపానని చెబుతున్నాడని.. మరీ కాంగ్రెస్ నాయకత్వం రాజేందర్ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతిస్తుందా? లేదా శ్రీధర్బాబు నిలిపిన వ్యక్తికి మద్దతిస్తుందా? చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్కు తెలియకుండానే కొందరు బీజేపీ కార్పొరేటర్లు ఈటల ప్రతిపాదించిన అభ్యర్థిని బలపరచడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని స్పష్టమవుతున్నదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటారన్నారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఐదేండ్లు మేయర్గా పనిచేసిన రవీందర్సింగ్ 50 మంది కార్పొరేటర్లకే హెల్త్కార్డులు ఇప్పించలేదని, ఇప్పుడు ఎంపీటీసీలకు హెల్త్కార్డులు ఇప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన మాటలను ఎవరూ నమ్మబోరన్నారు. పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసిన ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు అర్ష మల్లేశం, మేచినేని అశోక్రావు పాల్గొన్నారు.