ప్రజా పోరాటాలను కొనసాగించాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య
తెలంగాణచౌక్, డిసెంబర్ 26: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు కొనసాగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయం (ముకుందలాల్ మిశ్రా భవనం)లో నిర్వహించిన సీపీఎం జిల్లా 9వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనం అధాని, అంబానీలకు ధారదత్తం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. కరోనా కట్టడిలో విఫలమై, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రధాని మోదీ, అమిత్షాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.? 40 కోట్ల మంది కార్మికుల హక్కులను కాలరాయడానికే లేబర్కోడ్ తీసుకొచ్చారని, వెంటనే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటల పని వేళలను 12 గంటలకు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. వ్యాపారులకు అనుకూలంగా కార్మిక, కర్షక, విద్య, విద్యుత్ చట్టాలు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవగాహన లేకుండా చట్టాలను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన విద్యుత్, విద్య చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ ఎన్ లక్ష్మీకాంతం పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా సభ్యులు ఎడ్ల రమేశ్, శ్రీనివాస్, శనిగరపు రజినీకాంత్, వాసుదేవా రెడ్డి, సాహెబ్, రాజిరెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.