పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 26: జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సం బంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారికి సంబంధించిన భూ సర్వే, భూ సేరకణపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జయశంకర్, వరంగల్ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూ సర్వే త్వరితగతిన చేపట్టాలని ఆదేశించా రు. జిల్లా పరిధిలో 37. 1 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఉంటుందని తెలిపారు. మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల పరిధిలో 493 ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు. ఇప్ప టి వరకు 20.15 కిలో మీటర్ల మేర 272. 35 ఎకరాలకు పైగా భూ సర్వే పూర్తి అయిందని అధికారులు వివరించగా, పెండింగ్ భూ సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సర్వే నిర్వహిస్తున్న సమయంలో కొంత మంది రైతులు, భూ యజమానుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరాలు తెలుపుతున్న వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని మంథని ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ, మంథని ఆర్డీవో కే నరసింహమూర్తి, జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్ కిశోర్, భూ సర్వే ఏడీ అశోక్, కలెక్టరేట్ సూపరిండెంటెంట్ దత్తు ప్రసాద్, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.