‘గెల్లు’ ప్రచారానికి తరలివచ్చిన జనం
నెత్తిన బోనాలు, బతుకమ్మలతో స్వాగతం
డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు మోతలు
ఆదరించాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి
హుజూరాబాద్లోనూ విస్తృత ప్రచారం
వీణవంక, సెప్టెంబర్ 25: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సకలజనం మద్దతు తెలుపుతున్నది. బేతిగల్లో శనివారం చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్తో కలిసి ఉదయాన్నే గ్రామానికి చేరుకున్న గెల్లు శ్రీనివాస్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, నెత్తిన బతుకమ్మలతో మహిళలు ఆహ్వానించారు. పెద్దలు గెలుపు తథ్యమంటూ దీవెనలు అందించారు. యువకులు ఆలింగనం చేసుకొని గెలుపుపై భరోసానిచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. సమస్యలు వింటూ.. బాగోగులను తెలుసుకుంటూ గెల్లు శ్రీనివాస్ ముందుకుసాగారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గెల్లు శ్రీనివా స్ మాట్లాడారు. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగ కల్పన, అభివృద్ధే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకున్నామని, ఆ ఉద్యోగాలు రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని విమర్శించారు. ఇచ్చిన మాటకన్నా ఎక్కువ లక్షాముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దని కొనియాడారు. కానీ, కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో 2 కోట్ల ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని మండిపడ్డారు. ఎంతో మంది మంత్రులు వారి నియోజకవర్గాలు, జిల్లాల్లో ఇండ్లు కట్టించి, సారె పెట్టి గృహ ప్రవేశాలు చేయిస్తోంటే.. చిత్తశుద్ధి లేని ఈటల రాజేందర్ పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలతో పేదలు, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచుతున్న ఘనత సీఎం కేసీఆర్దని, 24 గంటల విద్యుత్, కాళేశ్వరంతో నీటి సౌకర్యం, రైతుపెట్టుబడితో రైతు పక్షపాతిగా పని చేస్తున్నారని కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నదని, ఇంకా మిగిలిన పనులు ఉంటే వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని, తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల గ్రామంలో పలువురు చెందగా, బాధిత కుటుంబాలను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. ఆయనవెంట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ పోలు లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్ రావు, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్రెడ్డి, సర్పంచ్ మోరె సారయ్య, ఉపసర్పంచ్ చొప్పరి తిరుపతి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గొర్రె రాజమౌళి, నాయకులు గొట్టుముక్కుల రవీందర్రావు, గోపాల్రావు, అందె కుమార్, గెల్లు మల్లయ్య, గెల్లు శ్రీనివాస్, నీల కుమార్, రాజమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద మనసుతో దీవించండి..
హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 25: ‘మీ కండ్ల ముందు బిడ్డను. మీరు ఆదరించి కారు గుర్తుపై ఓటేసి అసెంబ్లీకి పంపించండి’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ 26వ, 27వ వార్డుల పరిధిలోని సూపర్బజార్, ఇందిరామార్గ్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్లతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయపై పూలు చల్లి, మంగళహారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడానని, 150కి పైగా కేసులపాలయ్యానని గుర్తు చేశారు. పేదింటి యువకుడిగా మీ ముందుకు వచ్చిన నన్ను పెద్ద మనస్సుతో ఆశీర్వదించాలన్నారు. పట్టణంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా తనకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. ఇక్కడ హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, మారపెల్లి సుశీల, తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, ఎం కుమార్యాదవ్, బీ శివకుమార్, గోస్కుల రాజు, పార్టీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు కే దోనీ, వీ రాజేశం, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, చందాగాంధీ, గందే సాయిచరణ్, సీహెచ్ శ్యామ్, బీఎస్ ఇమ్రాన్, ఎండి రియాజ్, షేక్ ఫయాజ్, తొగరు శివ, ఆలేటి శ్రీరాం, మొలుగు శ్రీనివాస్, అనిల్, సమ్మయ్య, మురళి ఉన్నారు.