ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు
కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేత
విద్యానగర్, జనవరి 25 : జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇంటింటా జ్వర సర్వే మంగళవారం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 685 టీంలు 37,823 ఇండ్లను సందర్శించారు. ఇందులో 966 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించి, మందుల కిట్లు అందజేశారు. అలాగే, 1057 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 106 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. 176 మంది హోం ఐసొలేషన్లో ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. జిల్లాలో 676 మందికి మొదటి డోస్, 3,569 మందికి రెండో డోస్, 264 మందికి బూస్టర్ డోస్, 177 మంది (15 నుంచి 17 సంవత్సరాల వయస్సు)కి టీకా వేసినట్లు ఆమె తెలిపారు.
గంగాధర, జనవరి 25: మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి మందులు అందజేసి, హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గకపోతే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 25: మండలంలోని గుండి-గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 టీంలు 14 గ్రామాల్లో ఐదో రోజు 349 ఇండ్లల్లో ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించినట్లు వైద్యాధికారి సురేశ్ తెలిపారు. 11 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. 105 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పీహెచ్సీ పరిధిలో మొదటి, రెండో డోసు, బూస్టర్ డోసు 103 మందికి వేసినట్లు పేర్కొన్నారు. గోపాల్రావుపేట పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో జ్వర సర్వే పూర్తయినట్లు వైద్యాధికారి సురేశ్ తెలిపారు. రామడుగు పీహెచ్సీ పరిధిలోని 9 గ్రామ పంచాయతీలు, 7 అనుబంధ గ్రామాల్లో 21 టీంలు సర్వే చేసినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. 855 ఇండ్లల్లో సర్వే చేయగా, 38 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, శిరీష, సీహెచ్వో నారాయణ, హెల్త్ సూపర్వైజర్ పవన్కుమార్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.