హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హరిత ఉద్యమానికి సర్వంసిద్ధమైంది. ‘అడవులను పెంచుదాం తెలంగాణకు పచ్చలహారం తొడుగుదాం, వానలు వాపసు రావాలి.. కోతులు వాపసు పోవాలి’ అన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం గురువారం పండుగగా ప్రారంభంకానున్నది. హరితహారంలో 2015 నుంచి రాష్ట్రంలో నాటిన 220.70 కోట్ల మొక్కలకు.. నేటినుంచి పదిరోజులపాటు నాటే 19.91 కోట్ల మొక్కలు తోడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన పచ్చని లక్ష్యం నెరవేరుతుంది. హరితహారం కోసం ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.5,591 కోట్లు వెచ్చించింది.
పచ్చని దారులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,241 నర్సరీల్లో ఇప్పటికే 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు. అడవుల్లో మొక్కలు నాటే పనులు మొదలైనా అడవుల వెలుపల మాత్రం గురువారం అధికారికంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏడోవిడత హరితహారంలో బహళ రహదారి వనాలకు (మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి రహదారికి ఇరువైపులా మూడునుంచి నాలుగు వరుసల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ను చేపడుతున్నారు. వీలున్న ప్రతిచోటా యాదాద్రి (మియావాకీ) తరహాలో మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పల్లెలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పు న పంపిణీ చేసి, వాటిని పెంచే బాధ్యతను కుటుంబాలకు అప్పగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్లాకులవారీగా అటవీ పునరుద్ధరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
అంతా సిద్ధం: మంత్రి అల్లోల
రాష్ట్రవ్యాప్తంగా ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 1 నుంచి పదిరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేట కలాన్లోని ఔటర్ రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో ఏడో విడత హరితహారాన్ని మంత్రి కేటీఆర్తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. హరితహారంలో భాగంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అంబర్పేట కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. హరితహారంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నామని, ఈఏడాది లక్ష్యాన్ని అధిగమించనున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్రంగాలకు చెందిన సుమారు 50 మంది ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు ఫిలింనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఉన్న పిల్లల పార్క్లో రాజ్యసభ్యుడు సంతోష్కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నట్టు వైద్యులు తెలిపారు.
జోరుగా గ్రీన్ చాలెంజ్
తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయ ప్రాంగణంలో డీఎంహెచ్ గడల శ్రీనివాసరావు మొక్కలు నాటారు. మహారాష్ట్రలోని అసోసియేషన్ ఆఫ్ సోషల్ బియోండ్ బౌండరీస్ నాయకుడు సాగర్ జైన్ ఆధ్వర్యంలో జరంది షాపూర్లో 2,700 మొక్కలను నాటారు.