తెలంగాణ దళిత బంధు గొప్ప పథకం
హుజూరాబాద్ ప్రజలు సీఎంను మర్చిపోరు
సంబురాల్లో మంత్రి గంగుల కమలాకర్
ఈటల తీరుపై ధ్వజం
కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ టౌన్ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ దళిత బంధు పథకానికి పురుడు పోయడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళితులు పెద్ద సంఖ్యలో హాజరై డప్పులు వాయిస్తుండగా మంత్రి కూడా దరువేశారు. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 74 ఏండ్లు గడుస్తున్నదని, ఎందరో నాయకులు సీఎంలు, పీఎంలుగా పదవులు అనుభవించారని, కానీ ఏ ఒక్కరూ దళితులు, వెనకబడిన కులాల సంక్షేమం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన కరీంనగర్ జిల్లాలో అందులో మరింత ఇష్టమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. పవిత్రమైన రైతుబంధు పథకాన్ని కూడా ఇక్కడే ప్రారంభించారని గుర్తు చేశారు. రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయం ఏ విధంగానైతే నేరుగా రైతుల ఖాతాల్లో పడుతుందో అదే తరహాలో దళిత బంధు పథకం కింద కూడా ఎంపికైన దళితుల ఖాతాల్లో నేరుగా 10 లక్షలు వేస్తారని, ఆ డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒక ఐఏఎస్ అధికారి వచ్చి దళితుల ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారని, అర్హులైన వారిని ఎంపిక చేస్తారని వివరించారు. అప్పుడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు దగ్గరుండి దళిత సోదరుల పేర్లు నమోదు చేయించాలని కోరారు. పేర్లు నమోదు చేయని పక్షంలో తమ శాసన సభ్యులను గానీ, తననుగానీ సంప్రదించాలని సూచించారు. ఇలాంటి గొప్ప పథకంపై ఊరూరా చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడని కొనియాడారు.
పాదయాత్ర ఎందుకో ఆలోచించాలి?
ఈటల రాజేందర్ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ఇవి ఎవరు కోరుకున్న ఎన్నికలో గుర్తించాలని మంత్రి కోరారు. ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కానీ, ప్రజలకు అన్ని తెలుసని, ఎలాంటి ప్రలోభాలకు లొంగరని స్పష్టం చేశారు. కేవలం 90 విలువ చేసే గోడ గడియారాల కోసం హుజూరాబాద్ ప్రజలు లొంగరని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ను మరిచి పోరని ఆయన స్పష్టం చేశారు. రాజేందర్ను సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహించారని, అయినా సీఎం పీఠంపైనే ఈటల కన్నేశారని మండిపడ్డారు. సుమారు 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారని ప్రశ్నించారు. హుజూరాబాద్లోనే కాకుండా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని చూస్తే అభివృద్ధి గురించి ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదని అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్కు ఇక్కడి రోడ్ల పరిస్థితిని వివరించిన వెంటనే 40 కోట్లు మంజూరు చేశారని, ఈ పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉండి కూడా అభివృద్ధి చేయలేని ఈటల ఇప్పుడు బీజేపీలోకి వెళ్లి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఒక్కసారి ఆలోచించాలని హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరికోసం పాదయాత్ర చేస్తున్నారో ఈటలను నిలదీయాలని పిలుపునిచ్చారు. 24గంటల కరెం టు ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, రైతు బంధు పథ కం కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని కూడా ప్రవేశ పెట్టారని అన్నారు.
బృహత్తర పథకం దళిత బంధు : ఎమ్మెల్యే సతీశ్కుమార్
ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందేలా సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని, ఇంతటి బృహత్తర పథకాన్ని ప్రవేశ పెట్టి, దానిని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. దళితుల స్థితిగతులు మారాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని, హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని దళిత నాయకుడు టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ కోరారు. ఇక్కడి నుంచి ప్రారంభించే ప్రతి పథకం విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్ నమ్మకమని, ఆ నమ్మకాన్ని మనందరం నిలబెట్టాలని కోరారు. దళితులు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.