కార్పొరేట్ జీఎం గోపాలకృష్ణ
ఓసీపీ- 3 పరిశీలన
యైటింక్లయిన్కాలనీ, ఆగస్టు 18: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేట్ జీఎం వై.గోపాలక్రిష్ణ సూచించారు. ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వ్యూపాయింట్ ద్వారా సందర్శించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, పని స్థలాల పెంపు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట జీఎం వెంకటేశ్వర్రావు, ప్రాజెక్టు అధికారి మోహన్ రెడ్డి, ఇంజినీర్ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.
బొగ్గు రవాణాపై ‘వీసీ’
బొగ్గు రవాణాపై ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులతో సింగరేణి సంస్థ కోల్ మూవ్మెంట్ ఈడీ అల్విన్, మార్కెటింగ్ జీఎంలు రవిశంకర్, సూర్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీసీ నిర్వహించి బొగ్గు ఉత్పత్తి, రవాణాపై పలు సూచనలు చేశారు. వినియోగదారులకు సకాలంలో బొగ్గు రవాణా అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీహెచ్పీ ద్వారా బొగ్గు రవా ణా చేసేందుకు నూతన యాంత్రికీకరణ విధానం, బొగ్గు గ్రేడ్ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇందులో ఎస్వోటూ జీఎం సం దనాల సాంబయ్య, ప్రాజెక్టు అధికారి మోహన్రెడ్డి, ఏజెంట్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ క్వాలిటీ మేనేజర్ వెంకటమోహన్, ఐటీ మేనేజర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఒప్పందాలపై సమీక్ష
గోదావరిఖని, ఆగస్టు 18: ఆర్జీ-1లో బొగ్గు రవాణా, బొగ్గు రవాణా ఒప్పందాల పనితీరుపై జీఎం, ఓసీపీ అధికారులతో కార్పొరేట్ కార్యాలయం నుంచి వీసీ నిర్వహించారు. బొగ్గు రవాణా ఒప్పందాల పనితీరు ఉత్పత్తి, ఉత్పాదకత, వర్షాకాలంలో జాగ్రత్తలు, ఆటంకం కలుగకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా అలాగే క్వారీ పని స్థలాల్లో రక్షణ చర్యలకు సంబంధించిన తదితర విషయాలపై సమీక్షించారు. కార్యక్రమంలో మేడిపల్లి ఓసీపీ పీవో సత్యనారాయణ, ఏజెంట్లు చిలుక శ్రీనివాస్, శ్రీనాథ్, దాసరి శ్రీనివాస్ ఉన్నారు.