తిమ్మాపూర్ రూరల్, జనవరి 28: తిమ్మాపూర్ మండలంలో జడ్పీ, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలన్నీ కలిపి 50ఉన్నాయి. అందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,762 మంది విద్యార్థులుండగా, ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతలో 17పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని పాఠశాలల్లో సైతం అభివృద్ధి పనులు జరుగుతుండగా, మాడల్ పాఠశాలలుగా ఎంపికైన పర్లపల్లి, నల్లగొండ ప్రాథమిక బడుల్లో పనులు పూర్తయ్యాయి. ఈ రెండు పాఠశాలల రిపేరింగ్కు పర్లపల్లి పాఠశాలకు 7లక్షలు, నల్లగొండ పాఠశాలకు 6లక్షలతో పూర్తయ్యాయి. అలాగే పర్లపల్లి పాఠశాలలో స్థానిక సర్పంచ్ మాదాడి భారతి సొంతంగా గార్డెనింగ్, మొక్కలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మొదటి విడుత జరుగుతున్న పనులు వేసవి సెలవుల్లో పూర్తి కానుండగా, అవి పూర్తయ్యాక మిగతా పాఠశాలల్లో సైతం రెండో విడుత చేపట్టనున్నారు.
సకల సౌకర్యాలు
పాఠశాలల్లో మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేలా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్ మాదిరిగా రూపుదిద్దారు. కలర్లు, విద్యుత్, ఫ్యాన్లు, బెంచీలు, ప్రహరీ, శిథిలమైన స్లాబ్ను రిపేర్ చేయడం, గార్డెనింగ్, నీటి సంపు, మిషన్ భగీరథతో నీటి సరఫరా, ముఖ్యంగా టాయిలెట్లు, రంగురంగుల బొమ్మలు గోడలకు వేయడం, చేతులు కడుక్కునేందుకు ప్లాట్ఫాం, బ్లాక్ బోర్డులు ఇంకా పాఠశాలకు అవసరమైన పూర్తి పనులు చేయిస్తున్నారు. పర్లపల్లి, నల్లగొండ ప్రాథమిక పాఠశాలలు మోడల్ పాఠశాలలుగా ఎంపిక కావడంతో సిబ్బందికి ఫర్నిచర్ను కూడా అందించనున్నారు. వంద శాతం పనులు పూర్తయిన పర్లపల్లి, నల్లగొండ పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో విద్యార్థులు సైతం మారిన పరిసరాలతో ఉత్సాహంగా వచ్చి చదువుకుంటున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రభుత్వం గత విద్యాసంవత్సరంలోనే అన్ని పాఠశాలల్లో ఆంగ్లమీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బడిలో సకల వసతులు సైతం కల్పించడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్నది. ప్రస్తుతం పర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 131 మంది, నల్లగొండలో 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, వంద శాతం పూర్తయిన పర్లపల్లి, నల్లగొండ ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 30న ప్రారంభించే అవకాశమున్నది.
ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు
మన ఊరు- మన బడిని ప్రభుత్వం ప్రారంభించాక మా సర్పంచ్ భారతి, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి పాఠశాలలో సమూల మార్పులు తెచ్చారు. పాఠశాల ఇప్పుడు ఎంతో అందంగా తయారైంది. దీంతో విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గార్డెనింగ్ వేయిస్తున్నారు. దీనికి కృషి చేసిన ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు.
– మంజుల, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం (పర్లపల్లి)
పాఠశాలలు బలోపేతమవుతాయి
‘మన ఊరు-మన బడి’తో పాఠశాలలు ఎంతో బలోపేతమవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న సమూల మార్పులతో పాఠశాలలకు గత వైభవం రాబోతున్నది. పాఠశాలలు బాగుంటే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.
-కేతిరెడ్డి వనితదేవేందర్రెడ్డి, ఎంపీపీ (తిమ్మాపూర్)