కోనరావుపేట, ఏప్రిల్ 20: ధాన్యం తూకంలో ఓ రైస్మిల్లు నిర్వాహకుడు గోల్మాల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, స్థానిక రైతుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన ఎదుగట్ల మహేశ్ రెండ్రోజుల కింద వరికోశాడు. కోసింది కోసినట్లే ధాన్యాన్ని విక్రయించేందుకు శుక్రవారం మర్తనపేట గ్రామంలోని సరస్వతీ రైస్ మిల్లుకు పంపించాడు. మొత్తం నాలుగు ట్రాక్టర్ల లోడ్ తరలించాడు. రైతు లెక్క ప్రకారం మొత్తం ధాన్యం 65 క్వింటాళ్ల తూకం రావాల్సి ఉంది. అయితే ఒక్కో ట్రాక్టర్ లోడ్ 17 క్వింటాళ్ల చొప్పున మొదటి రెండు లోడ్లు వెయిట్ రాగా, తర్వాత లోడ్ 10 క్వింటాళ్లు, చివరి లోడ్ కేవలం 5 క్వింటాళ్లు.. మొత్తంగా 49 క్వింటాళ్లు మాత్రమే తూకం వచ్చిం ది. ఆ మేరకు ట్రాక్టర్ డ్రైవర్కు ట్రక్ షీట్లు ఇచ్చి పంపించగా, వాటిని చూసి రైతు కంగుతిన్నాడు.
ప్రతి లోడ్లో ధాన్యాన్ని ఒకే మొత్తంలో పంపిస్తే తూకంలో తేడాలు ఎలా వచ్చాయని సదరు రైతు మరికొంత మంది రైతులతో కలిసి మిల్లు నిర్వాహకుడి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. దీంతో చివరి రెండు లోడ్లలో ధాన్యం తక్కువగా వచ్చిందని, వచ్చింది వచ్చినట్లే తూకం వేసి ట్రక్ షీట్లు ఇచ్చానని మిల్లు నిర్వాహకుడు దురుసుగా మాట్లాడాడు. గోల్మాల్ ఎక్కడ జరిగిందో..? తెలుసుకునేందుకు శనివారం ఉదయం మర్తనపేట గ్రామ చౌరస్తాలో ఉన్న సీసీ పుటేజీని రైతులు పరిశీలించారు. అయితే ట్రాక్టర్ లోడ్లో ఎక్కడా తేడా లేదని, ఫుల్గానే ధాన్యం వచ్చినట్లు గుర్తించారు. నిర్వాహకుడి వద్దకు వెళ్లి గొడవ చేయడంతో అతడు సైతం పుటేజీ పరిశీలించి జరిగిన తప్పుఒప్పుకున్నాడు. మొత్తం 65 క్వింటాళ్ల ధాన్యాన్ని లెక్క చూపాడు. జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు. అయితే ఈ విషయం బయటికి రావడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ తామూ ఇలాగే మోసపోయి ఉంటామంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.