హుజూరాబాద్ రాజకీయాల్లోకి యువనేత గెల్లు శ్రీనివాస్ యాదవ్
కులాలు, పార్టీలకతీతంగా యువత మద్దతు
సీఎం కేసీఆర్ది సరైన నిర్ణయమంటూ సంతోషం
ఇక్కడ గెలిపిస్తేనే ఇతర పార్టీలు సైతం యువతకు అవకాశం ఇస్తాయంటున్న యువకులు
ప్రచారం కోసం కదలుతున్న దండు
కరీంనగర్ ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తరతరాలుగా వచ్చే రాజకీయాలకు స్వస్తి చెప్పి.. యువశక్తిని రంగంలోకి దింపుతున్నది టీఆర్ఎస్. యువతే దేశానికి వెన్నెముకే కాదు, భవిష్యత్ వారిదే అని నమ్ముతున్న ఆ పార్టీ.. ఇప్పటికే చాలా మంది యువకులను తెరపైకి తెచ్చింది. పదవుల్లో అవకాశం కల్పించింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించేందుకు మరో యువ కిశోరాన్ని ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ బరిలోకి దింపింది. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి.. వందకుపైగా కేసులను ఎదుర్కొని పలుసార్లు జైలుకు వెళ్లిన గెల్లు శ్రీనివాస్యాద పేరును అధికారికంగా ప్రకటించింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి,. కష్టాల కడలిలో పెరిగి.. పల్లె ప్రజల సమస్యలు తెలుసుకొని.. తన శక్తి మేరకు పరిష్కారంవైపు అడుగులు వేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న తరుణంలోనే ఎమ్మెల్యేగా పోటీచేసే చాన్స్ వచ్చింది. నిజానికి హుజూరాబాద్ గడ్డ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఉన్నత విద్యను అందిపుచ్చుకొని.. ఉద్యమాలు చేసిన యువనాయకులకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. అందులోనూ యాదవ కులస్తులకు అసలే రాలేదు. ఈ నియోజకవర్గంలో సుమారు 23వేల ఓట్లకుపైగా ఉన్న ఈ వర్గాన్ని ఓట్ల కోసం చూశారే తప్ప.. వారి సంక్షేమంపై శ్రద్ధచూపలేదు.
30 శాతం వరకు యువతే..
ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో 2.26 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు 50 నుంచి 60 వేల వరకు యువకులే ఉన్నారు. అంటే ఏ పార్టీనైనా సరే శాసించే స్థాయి హుజూరాబాద్ నియోజకవర్గంలోని యువ ఓటర్లకు ఉంది. అంతేకాదు ఇందులో ఎంతో మంది విద్యాధికులున్నారు. తమకున్న తెలివితేటలతో అలవోకగా ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల సత్తా వారికి ఉన్నది. కానీ, వీరిలో ఏ ఒక్కరికీ ఇన్నాళ్లుగా ప్రాతినిధ్యం రాలేదు. ఈ పరిస్థితుల్లో విద్యాధికుడు, విద్యారంగ సమస్యలపై పోరాటం చేసిన బీసీ బిడ్డగా మంచి పేరు సంపాదించుకున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ అంటే.. ఈ గడ్డపై ప్రతి ఒక్కరికీ సుపరిచుతుడే. అతనితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకున్న వాళ్లు, ఉద్యమం చేసిన వాళ్లే అధికంగా ఉన్నారు. అందుకే.. శ్రీనివాస్యాదవ్కు వ్యక్తిగతంగా కూడా యువకుల్లో మంచి క్రేజీ ఉన్నది. ఆయన ‘అన్నా..’ అని పిలిస్తే వాలిపోయే మనిషి. యువకులు కూడా తమ కష్టసుఖాలను చెప్పుకోవడానికి అతని ముందు వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్కు టికెట్ రావడాన్ని ఈ ప్రాంత యువకులు స్వాగతిస్తున్నారు. అంతేకాదు, యావత్తు యువలోకానికి ఒక శుభ పరిణామమన్న సంకేతం ఇస్తున్నారు. గెల్లును గెలిపించుకుంటే.. యువ సత్తా ఏమిటో తెలియడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు సైతం యువకులకు టికెట్లు ఇవ్వాలంటే.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలువడం ఒక్కటే పరిష్కారం అని ఘంటాపథంగా చెబుతున్నారు.
శీనన్నను గెలిపించి కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తం..
ఉద్యమకారుడిగా గెల్లు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. పేదింటి బిడ్డకు టికెట్ ఇచ్చి కేసీఆర్ మరోసారి సామాన్యుడి వైపే అని నిరూపించిండు. ఉద్యమ కాలంలో శ్రీనివాస్ ఎన్నో కేసులు మీదేసుకున్నడు. జైల్ల పడ్డడు. దెబ్బలు తిన్నడు. అసొంటోనికి గుర్తింపునియ్యాలె. నేను కూడా ఉద్యమ కాలంల శ్రీను వెంబడి నడిసిన. పట్టు పట్టిండంటే ఇడిసి పెట్టడు. తెలంగాణ వస్తే మన కష్టాలన్నీ తీరిపోతయని అందరికీ గట్టిగ చెప్పేటోడు. మనం.. మన పిల్లలు.. మన ఊరు బాగుపడతదని ఎప్పుడూ అంటుండే. మంచి రోజులస్తయని చెబుతుండే. ఇయ్యాల అది నిజమే అని అనిపిస్తున్నది. ఉద్యమ నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు చేతులెత్తి దండం పెడుతున్న. గెల్లు శ్రీనన్నను అధిక మెజార్టీతో గెలిపించి, విజయాన్ని కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తం. ఈటల రాజేందర్ చేయబట్టి మాలాంటోళ్లందరికీ అన్యాయం జరిగింది. శీనన్న గెలిస్తే న్యాయం జరుగుతది. హుజూరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తడు. ప్రతి ఒక్కరూ శీనన్నకు ఓటేస్తనే బాగుంటుందని అంటున్నరు.
శ్రీను గెలుపు కోసం కష్టపడుతం..
హుజూరాబాద్, ఆగస్టు 12: టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా యువకుడికి టికెట్ ఇవ్వడం అభినంద నీయం. పేదింటి బిడ్డయిన గెల్లు శ్రీను గెలుపు కోసం కచ్చితంగా కష్టపడుతం. గతంలో కేసీఆర్ టికెట్ ఇస్తేనే ఈటల రాజేందర్ గెలిసిండు. ఆయన హుజూరాబాద్కు చేసిందేమీ లేదు. కనీసం వార్డుల్లో రోడ్లన్నా బాగు చేసింది లేదు. ఆయన దిగినంకనే అభివృద్ధి పనులు అయితున్నయ్. నూటికి నూరుపాళ్లు టీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తది. యువకులు, రైతులు అందరూ కారు గుర్తుకు ఓటెయ్యాలె. గులాబీ జెండాతోనే పేదలకు మంచి జరుగుతది.
కేసీఆర్కు కానుకగా ఇస్తం..
మా బిడ్డ.. మా కులస్తుడైన గెల్లు శ్రీనివాస్యాదవ్కు టికెట్ ఇవ్వడం సంబురంగా ఉంది. కేసీఆర్ సార్ మాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుంటం. మాకులపోళ్లంతా ఒక్కటైతం. ఎంత కష్టమైనా సరే గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకుంటం. విజయాన్ని కేసీఆర్కు కానుకగా పంపుతం.
గెల్లును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
యాదవ కులానికి చెందిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు టికెట్ ప్రకటించిన సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలుపించుకుని తీరుతాం. తప్పకుండా అసెంబ్లీకి పంపిస్తాం.
పేదింటి బిడ్డకు పట్టంగడుతం..
మా కులస్తులకు ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. రాకరాక వచ్చిన అదృష్టాన్ని వదులుకోం. ఉద్యమ నాయకుడిగా, పేదబిడ్డగా శ్రీనివాస్ యాదవ్కు పేరుంది. ఆయన గెలిస్తేనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ కోసం మస్తు కొట్లాడిండు. జైలుకు పోయిండు. పేదింటి బిడ్డకు పట్టంగట్టి.. ఈటలకు బుద్ధిచెబుతం.