మల్యాల, అక్టోబర్ 11: కొండగట్టు అంజన్న ఆలయ వసతిగదిలో ఈ నెల 5న అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కొడుకుతో కలిసి భార్య తన భర్తను హతమార్చింది. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ సోమవారం మల్యాల ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 5న ఆలయ అంజనా కాటేజీ గది నంబర్ 8లో ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసిన ఆలయ సిబ్బంది మల్యాల పోలీసులకు సమాచారం అందించారు. ధర్మపురి సీఐ కోటేశ్వర్, మల్యాల ఎస్ఐ నాగరాజు మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు కనిపించడంతో ఆలయ ఈవో వెంకటేశ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఏరియా దవాఖాన మార్చురీలో భద్రపరిచి అన్ని ఠాణాలకు సమాచారమిచ్చారు. అలాగే సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుడి బంధువులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోను చూసి గుర్తించగా మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మిట్టపెల్లి కృష్ణగా తేలింది. దీంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఈ క్రమంలో పోలీసులు బృందాలుగా విడిపోయి ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి మృతుడి కుమారుడు మిట్టపెల్లి రాజు, భార్య మిట్టపెల్లి పోచమ్మ అలియాస్ పుష్ప, జాజు రాజేశ్ కృష్ణను హత్య చేసినట్లు ఆధారాలు సేకరించారు.
రాజును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. రాజుకు చిన్నతనం నుంచి హిజ్రాలా తయారు కావడం అలవాటు, తనకు హైదరాబాద్కు చెందిన జాజు రాజేశ్తో 5 నెలల కిందట ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి (హోమోసెక్స్) దారితీసింది. రాజు, రాజేశ్ను ఇంటికి తీసుకెళ్లి సహజీవనం చేసేవారు. ఈ క్రమంలో మృతుడి భార్య మిట్టపెల్లి పోచమ్మ తన కొడుకుతో సన్నిహితంగా ఉంటున్న రాజేశ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం ఆమె భర్త మిట్టపెల్లి కృష్ణకు తెలిసింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించి కృష్ణను హతమార్చేందుకు పథకం పన్నారు. ఈ క్రమంలో భార్య కొడుకులు కృష్ణను దైవదర్శనానికి తీసుకెళ్లారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత అక్టోబర్ 4న కొండగట్టుకు వచ్చి ఇక్కడి అంజనా కాటేజీలో గది నంబర్ 8 గదిలో బస చేశారు. ఈ క్రమంలో రాజు, పోచమ్మ, కృష్ణ ను గొంతు నులిమి హతమార్చారు. వీరికి రాజేశ్ సహకరించాడు. మిట్టపెల్లి రాజు కొండగట్టు ఘాట్రోడ్డుపై తిరుగుతుండగా సోమవారం ఉద యం మల్యాల సీఐ రమణమూర్తి అరెస్ట్ చేశారని తెలిపారు. పోచమ్మ, రాజేశ్ పరారీలో ఉన్నారు.