ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎనిమిది రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11,58,263 అప్లికేషన్లు వచ్చాయి. కేవలం ఆఖరి రోజే 1,28,790 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రారంభం కాగా, రెండు సెలవు రోజులు పోనూ ఈ నెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. మొదట్లో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు తిప్పలు పడగా, కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ‘ప్రజా పాలన’కు శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి గత డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెలవు రోజులు డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మినహా ఎనిమిది రోజుల పాటు ప్రతి రోజూ అర్జీలు తీసుకున్నది. అయితే ఈ ఎనిమిది రోజుల్లో దరఖాస్తులు వెల్లువలా రాగా, మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఎక్కడ చూసినా ప్రజలు బారులు తీరి కనిపించారు. మొదట్లో అంతా గందరగోళానికి గురయ్యారు.
దాదాపు అంతటా దరఖాస్తులు ప్రతులు అందక ఇబ్బంది పడ్డారు. గామ సభలకు ఒక రోజు ముందే ఫారాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించినా ఉంచలేకపోయారు. దాంతో చాలా మంది జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీసి, 20 నుంచి 40 వరకు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. ఈ అప్లికేషన్లను పూరించే క్రమంలో అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు ఇవ్వడం, అందులో చాలా వాటికి సంబంధించి క్లారిటీ లేకపోవడంతో ఆగమయ్యారు. ఎవరిని అడుగాలో తెలియక.. ఎలా నింపాలో అర్థంకాక అయోమయానికి గురయ్యారు.
ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమ ధ్రువపత్రాలను జత చేసి అందించారు. మరోవైపు ప్రతి రోజూ కేంద్రాలకు జనం పోటెత్తారు. చివరి రోజూ అయితే వేలాదిగా తరలివచ్చారు. సభలు ముగిసినా బారులు తీరారు. ఎనిమిది రోజుల్లో మొత్తం 11,58,263 అప్లికేషన్లు వస్తే.. మొదటి రోజు 94,530, చివరి రోజు 1,28,790 దరఖాస్తులు సమర్పించారు. అర్జీల స్వీకరణ ముగియడంతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. అప్లోడ్ను 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, ఆ లోగా పూర్తి చేసేందుకు వేగవంతం చేశారు.