దళితబంధు’ అమలు కోసం సమన్వయంతో పని చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం
రూ.500 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడి
ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, దళిత బంధు రిసోర్స్ పర్సన్లు
కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం కింద లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని, అందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘దళితబంధు’ పథకం అమలుపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, దళితబంధు మండల రిసోర్స్ పర్సన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు మొదటి విడుతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 16న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. సాచురేషన్ పద్ధతిన అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మంజూరు చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి విడుత 5 వేల మంది అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 16న హుజూరాబాద్లో దళిత బంధు పథకం ప్రారంభ కార్యక్రమానికి లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు 825 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని, ప్రతి బస్సుకు ఒక రిసోర్స్పర్సన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి విడుతలో రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దళితబంధు మండల రిసోర్స్ పర్సన్లు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒకరికీ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తుందని తెలిపారు. మొదటి విడుతలో 5 వేల మందికి, మిగిలిన వారికి విడుతల వారీగా మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, మండల ప్రత్యేక అధికారులు డీఆర్డీవో శ్రీలతారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్కుమార్, డీపీవో వీరబుచ్చయ్య, డీసీవో శ్రీమాల, మార్కెటింగ్ ఆఫీసర్ పద్మావతి, డీఈవో జనార్ధన్రావు, కార్పొరేషన్ ఈడీ మధుసూదన్శర్మ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్, దళితబంధు మండల రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.