డీఏవో తిరుమల ప్రసాద్
ఇతర పంటలపై అవగాహన సదస్సు
జ్యోతినగర్(రామగుండం), డిసెంబర్ 8: రైతులు పప్పు ధాన్యాలు సాగు చేయడంతో భూ సారం పెరిగి మేలు చేకూరుతుందని డీఏవో తిరుమల ప్రసాద్ తెలిపారు. అంతర్గాం మండలం మర్రిపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు ఇతర పంటల సాగుపై బుధవారం అవగాహన సదస్సు చేపట్టగా, డీఏవో హాజరై మాట్లాడారు. పెసర, మినుము, నువ్వు, పొద్దుతిరుగుడు, శనగ, వేరు శనగ వైపు దృష్టి సారించాలని సూచించారు. నూనె గింజల పంటలను సాగు చేయాలని డీఏవో వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి ప్రవీణ్కుమార్, ఏవో రాంబాబు, ఏఈవో హరీశ్ తదితరులున్నారు.
ఇతర పంటలు వేయాలి
ఓదెల, డిసెంబర్ 8; ప్రస్తుత యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రైతు వేదిక భవనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో వ్యవసాయ అధికారులు సమావేశాలను నిర్వహిస్తూ పంటల మార్పిడి ఆవశ్యతను రైతులకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని చెబుతుండడంతో రైతులు వరి సాగు చేయవద్దని పేర్కొంటున్నారు. సీడ్ కంపెనీలు కానీ, ధాన్యం ఇతర మార్గాల ద్వారా అమ్ముకుంటామనే నమ్మకం ఉంటే తప్పా వరి వేయవద్దని సూచిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే ఇతర వాణిజ్య పంటల వైపు రైతులు ముందుకెళ్లాలని కోరుతున్నారు. ఇందుకు ప్రభుత్వం డీసీఎంఎస్ల ద్వారా పెసర, మినుము, శనగ విత్తనాలు అందుబాటులో ఉంచిందని వివరిస్తున్నారు. బుధవారం ఓదెలలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏఈవో సంధ్య యాసంగి పంటల సాగుపై రైతులకు వివరించారు. వరికి బదులుగా ఇతర పంటల సాగు యాజమాన్య పద్ధతులపై ప్రభుత్వం ప్రచురించిన బ్రోచర్లను రైతులకు పంపిణీ చేశారు.