పాత ట్యాంకులను సైతం వినియోగంలోకి తేవాలి
ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలి
సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
అధికారులతో సమీక్ష
కలెక్టరేట్, ఆగస్టు 7: జిల్లాలో ఇంటింటికీ తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కృష్ణభాస్కర్ సీఎంవో కార్యదర్శికి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మిషన్ భగీరథకు సంబంధించి పాత ప్లాంట్లపై అశ్రద్ధ చేయవద్దన్నారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హ్యాబిటేషన్లకు అనుగుణంగా సరఫరా సక్రమంగా చేయాలని చెప్పారు. ఫిల్టర్బెడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే మరిన్ని ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని, తగిన జాగ్రత్తలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. హ్యాబిటేషన్ 60 శాతం ఉంటే ప్లాంట్ల నిర్మాణానికి తప్పనిసరిగా భూములు కొనుగోలు చేస్తామన్నారు. భూ సమస్య లేకుండా చూడాలని అప్పుడే పనులు ప్రారంభించడానికి వీలవుతుందన్నారు. ఫిల్టర్బెడ్లో నీటి శుద్ధికి సంబంధించి సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఎండీ శ్రీనివాస్, ఈఈ విజయ్కుమార్, రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ శ్రీనివాస్ సంబంధిత ఎస్ఈలు, డీఈలు, టీఏలు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
గంభీరావుపేట/ వేములవాడ రూరల్, ఆగస్టు 7: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు శివారులోని కోళ్లమద్దిలో సుమారు రూ. 21 కోట్లతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన శుద్ధజల కేంద్ర మోటర్లు, పైపు లైన్లు తదితర మరమ్మతు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే వేములవాడ మండలం అగ్రహారం మిషన్భగీరథ ఈటీపీ ప్లాంట్ను సైతం పరిశీలించారు. నీటిశుద్ధి సక్రమంగా చేయాలని సూచించారు. అనంతరం ప్లాంట్ సమీపంలో మొక్కలు నాటారు. ఆమె వెంట సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆరోగ్యశాఖ రాష్ట్ర అధికారి శ్రీధర్, గంభీరావుపేట ఎంపీపీ వంగ కరుణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, మిషన్ భగీరథ సీఈ శ్రీనివాస్రావు, ఎస్ఈ శ్రీనివాస్, సర్పంచులు ఏనుగు కేశవరావు, ఎడబోయిన రాజు, గంభీరావుపేట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరిప్రియ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దయాకర్రావు, నాయకులు వంగ సురేందర్రెడ్డి, రాజు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.