జగిత్యాల, అక్టోబర్6(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో వేల మొక్కలు నాటారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద వివిధ రకాల మొక్కలు నాటి హరితక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. కళాశాలకు చెందిన 20 ఎకరాల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే వివిధ రకాల 6వేల మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించారు. గతంలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మై దానం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి ఉండే ది. జగిత్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ ఏ శరత్ ప్రత్యేక చొరవ తీసుకొని, ఈజీఎస్ సిబ్బంది, కూలీలతో 20ఎకరాల మైదానాన్ని కూలీలతో చదును చేయించి క్రమపద్ధతిలో మొక్కలు నాటడంతోపాటు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి సంరక్షణ జరిగేలా చూశారు. ఉద్యానవన శాఖ అనుసంధానంతో హరితహారంలో నాటిన మొక్కలకు డ్రిప్ పైప్లైన్ ద్వారా మొక్కలకు నీరందించారు. ప్రతి 200 మొ క్కలకు వాచ్అండ్వార్డు ద్వారా నీరు పోయడం, కలుపుతీయడం, పాదులుచేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో మార్పు కనిపించింది.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా హరితహారంలో భాగంగా నాటిన 6వేల మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొక్కలను పశువులు, గొర్రెలు, మేకలు తినకుండా మొక్కల చుట్టూ ఈజీఎస్ సిబ్బంది కంచెలను ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మొక్కలు ఎండిపోకుండా డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకు నీరందేలా చర్యలు చేపట్టారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కలకు ఎరువులు, కలుపు తీయడం, మొక్కల సంరక్షణకు తగిన మందులనును ఉపయోగించారు. ఎరువుల తయారీకి నాడెం కంపోస్టును ఏర్పాటు చేశారు.
మొక్కల సంరక్షణకు కళాశాల సిబ్బంది సహకారం
ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు కళాశాల సిబ్బంది తమవంతు సహకారం అందించారు. మామిడి, ఉసిరి, జామ, అల్ల నేరేడు, దానిమ్మ, సీతాఫలం, సపోట, ఖర్జూరా, బాదాం తదితర పండ్ల మొక్కలతో పాటు మందారం, గుల్మే ర్, తదితర పూల మొక్కలు ఏర్పాటు చేశారు. సీమరూప, చైనా బాదాం, టేకు, వెదురు, నారవేప, నీలగిరి, ఏడు ఆకులపాయతోపాటు, తాటి, ఈత చెట్లను నీడనిచ్చే మొక్కలను ఏర్పాటు చేశారు. కాగా వెయ్యి మామిడి మొక్కలు, 500 టేకు మొక్కలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మామిడి, టేకు వనాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే ఎస్కేఎన్ఆర్ ప్లాంటేషన్ ప్రత్యేకం
జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో మూడో విడుత హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఈ విషయమై కళాశాలను ఏడాది క్రితం పరిశీలించిన ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్ చాలా గొప్పదని కితాబునిచ్చారు. అప్పటి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలకు ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆ ప్లాంటేషన్ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది.