జగిత్యాలరూరల్, ఆగస్టు 6: జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి గతంలో జగిత్యాల జిల్లా, ఇప్పుడు వైద్య కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి శుక్రవారం సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ జిల్లా కు వైద్య కళాశాల మంజూరు విషయంలో వైఫ ల్యం చెందారని ఆరోపించారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి మెడికల్ కాలేజీని మంజూరు చేయించామన్నారు. కళాశాల ఏర్పాటుపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపిండని దుయ్యబట్టారు. ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆయన క న్నా, పూర్వ వైద్య విద్యార్థి, ఒక వైద్యుడిగా తనకే బాగా తెలుసన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న 29 ఎకరాల స్థలం సరిపోతుందన్నారు. నియమనిబంధనలు తనకు తెలుసనన్నారు, వైద్య కళాశాలకు 50ఎకరాలు అవసరం లేదని స్పష్టం చేశారు. చల్గల్ ఎంపీటీసీ ఎన్నికల్లో లబ్ధికోసమే జీవన్రెడ్డి రాద్ధాంతం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాబోయే 3 నెలల్లో 300 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధరూర్ క్యాంపులో ఉన్న ప్రభుత్వ స్థలం అనువుగా ఉన్నదన్నారు. ఇక్కడ విశాలమైన రోడ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. సతీశ్, అల్లె గంగసాగర్,కూతురు శేఖర్ తదితరులు ఉన్నారు.