ప్రత్యేక శిబిరానికి భారీ స్పందన
పెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగులు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
నేడూ శిబిరం కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు
జమ్మికుంట, ఆగస్టు 6: జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రభుత్వం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. జమ్మికుంట మున్సిపల్, మండలంలోని 20గ్రామాలు, వీణవంక, ఇల్లందకుంట, తదితర మండలాల నుంచి కూడా దివ్యాంగులు తరలివచ్చారు. అందుబాటులో సదరం క్యాంపు ఏర్పాటు చేయడంపై దివ్యాంగులు సంబుర పడ్డారు. శిబిరానికి అధికారులు టెంట్లు, కుర్చీలు, నీళ్లు, తదితర ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులై ఉండి సదరం సర్టిఫికెట్ లేని వారి కోసం, శారీరక దివ్యాంగులకు (ఆర్థో), బధిరులకు(మూగ, చెవిటి), అంధులకు(ఐ ప్రాబ్లెమ్) ఉన్న వారికి వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ సుమన్రావు, చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, సీఐ రాంచందర్రావు, వైద్యాధికారులు దివ్యాంగులకు కరోనా నిబంధనలు వివరించారు. క్యూలో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. శిబిరంలో ఈఎన్టీ, ఆర్థో, తదితర పరీక్షల కోసం, తర్వాత సర్టిఫికెట్లు అందించేందుకు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని డీఆర్డీవో అధికారులు సూచించారు. ఆర్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, వారి వద్ద దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కొక్కరుగా ప్రత్యేక వైద్యుల వద్దకు వెళ్లారు. పరీక్షలు చేయించుకున్నారు.
సర్టిఫికెట్లు తర్వాత అందజేస్తామని దివ్యాంగులకు వైద్యులు చెప్పి పంపించారు. కాగా, ఈ శిబిరానికి ఆర్థోకు సంబంధించి దాదాపు వెయ్యి దరఖాస్తులు, అలాగే మూగ, చెవిటికి సంబంధించి 500, అంధులకు సంబంధించి 500 అర్జీలు వచ్చాయి.
మరో రెండు రోజులైనా శిబిరం కొనసాగేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి కొప్పుల
సదరం శిబిరం వద్దకు మంత్రి కొప్పుల ఈశ్వర్ వచ్చారు. ఏర్పాట్లను సమీక్షించారు. వైద్య బృందానికి తగు సలహాలు, సూచనలు అందించారు. ఇంత పెద్ద మొత్తంలో దివ్యాంగులు రావడం, వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. మండలాల వారీగా, రోగాల వారీగా దివ్యాంగులకు వేర్వేరు కౌంటర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. శిబిరం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేర్వేరు కౌంటర్లు పెట్టాలని సూచించారు. రెండు రోజులైనా శిబిరంలో ప్రతి దరఖాస్తుడికీ న్యాయం జరుగాలని చెప్పారు. తర్వాత స్థానిక వైద్య బృందంతో మాట్లాడుతూ.. ఇబ్బందేమీ లేదని, మరో రెండు రోజులైనా శిబిరం కొనసాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని పేర్కొన్నారు.