గొలుసు దొంగ అరెస్ట్
తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి వెల్లడి
చిగురుమామిడి, ఫిబ్రవరి 12: సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. అతడి నుంచి 15గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చిగురుమామిడి పోలీస్స్టేషన్లో శనివారం ఎస్ఐ సుధాకర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 7న సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన మహిళా కండక్టర్ యాలం వనజ హుస్నాబాద్ డిపోలో విధులు ముగించుకొని బైక్పై దుద్దెనపల్లికి వెళ్తున్నది. బొమ్మలపల్లికి చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన హుస్నాబాద్కు చెందిన కాటం మహేశ్ ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల్లో నిందితుడిని పట్టుకున్నారు. మహేశ్ నేరం అంగీకరించాడని సీఐ తెలిపారు. ఆన్లైన్ గేములకు అలవాటు పడి, అప్పులపాలై సులువుగా డబ్బు సంపాదించాలని అతడు చోరీలు చేస్తున్నాడని చెప్పారు. దొంగిలించిన బంగారం అమ్మేందుకు శనివారం కరీంనగర్ వెళ్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా చిగురుమామిడిలో పోలీసులు అతడిని పట్టుకున్నారని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ దాస సుధాకర్, కానిస్టేబుళ్లు అహ్మద్ బాషా, హసన్ను సీఐ అభినందించారు.