Ketan Murder Case : మహారాష్ట్ర (Maharastra) లోని పుణె జిల్లా (Pune district) లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ 25 ఏళ్ల కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితులు సియా గోయెల్ (Sia Goyel), చేతన్ చౌధరి (Chethan Chaudhary) లకు లైడిటెక్టర్ పరీక్షలు (Lie detector Test) నిర్వహించాలన్న పోలీసుల ప్రయత్నాలకు గండిపడింది. లైడిటెక్టర్ సియా, ఆమె ప్రియుడు చేతన్ ఒప్పకోలేదు. దాంతో పోలీసులు ఆ ఇద్దరినీ మళ్లీ జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) కు తరలించారు.
కాగా శుక్రవారం నిందితుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని వడ్గావ్ మావల్ కోర్టుకు తరలించారు. ఆ ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలావుంటే జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి కేతన్ను తోసి హత్య చేసినట్టు అతడితో నిశ్చితార్థం చేసుకున్న 20 ఏళ్ల సియా గోయల్, ఆమె ప్రియుడు, 22 ఏళ్ల చేతన్ చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలను తెలుసుకున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మే నెలలోనే పుణెలోని లూల్లానగర్ సమీపంలో ఉన్న ఒక క్లబ్ వద్ద కేతన్ను కొండపై నుంచి ఎలా తోసేయాలో వీరిద్దరూ కలిసి ‘రిహార్సల్’ చేసినట్లు తేలింది.
జూలై 2న నిందితురాలు సియాను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. అలాగే హత్య జరిగిన రోజున సియా ధరించిన దుస్తులను కూడా పోలీసులు ఆమె నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి నిందితుల మొబైల్ డేటా, లొకేషన్ వివరాలు సహా బలమైన సాంకేతిక, డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే కేసులోని మరిన్ని రహస్యాలను రాబట్టడానికి నిందితులు ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించారు.
దీనిపై కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. వారి సమ్మతిని రికార్డ్ చేసిన తర్వాత తదుపరి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. కానీ లైడిటెక్టర్ పరీక్షలకు నిందితులు ఒప్పుకోకపోవడంతో పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది.