సిరిసిల్ల రూరల్, ఆగస్టు 24: వట్టిమల్లలో ఈ నెల 17న ఎర్రజెండాలు పాతి, రెండు గ్రామాల్లో సీపీఐ (మావోయిస్టు) పేరిట లేఖలు రాసి, భయబ్రాంతులకు గురి చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. గ్రామంలోని 45 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు పథకం వేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. కోనరావుపేట మండలం వట్టిమల్లలోని భూక్యారెడ్డి తండాకు చెందిన లకావత్ సతీశ్ (23) ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ జీవిస్తుంటాడని, అయితే గ్రామంలోని 45 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకోవాలని పథకం వేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో అటవీ అధికారులు భయపడి భూముల జోలికి రాకూడదని ఆ ప్రాంతంలోని చెట్లకు సీపీఐ (మావోయిస్టు) జెండాలను కట్టాడని, ఈ విషయం భూక్యారెడ్డితండా, అజ్మీరా రెడ్డి తండా (గ్రామ పంచాయతీలు)ల్లోని ప్రజలకు తెలిసేలా ఎరుపు రంగుతో లేఖలు రాసి, సీపీఐ (మావోయిస్టు) రెడ్ ముద్ర వేసి ప్రతి ఇంటి తలుపుల వద్ద పెట్టినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. జెండాలు, రబ్బర్ స్టాంపులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారించారు. లకావత్ సతీశ్, అతనికి సహకరించిన సనుగులకు చెందిన జటోతు ప్రశాంత్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సీఐ సర్వర్, సీఐ శ్రీలత, ఎస్ఐలు మహేశ్, రాజశేఖర్, సిబ్బందిని అభినందించారు. సిబ్బంది అబ్బాస్ నాగరాజు, శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, మదన్లాల్ ఉన్నారు.