విద్యానగర్, జనవరి 24: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన కొవిడ్ వ్యాప్తి నియంత్రణపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొవిడ్ బాధితులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలని, ఆక్సిజన్, పడకలు సిద్ధంగా ఉంచాలన్నారు. సాధారణ రోగులకు, కొవిడ్ బాధితులకు వేర్వేరుగా విభాగాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ర్యాపిడ్ పరీక్ష నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉంటే మెడికల్ కిట్లు అందించాలన్నారు. కొవిడ్తో వచ్చే గర్భిణులకు ప్రసవాలు చేయాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ 98.7 శాతం పూర్తయిందని, మంగళవారంలోగా వందశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. జిల్లాలోని మానకొండూర్, గంగాధర, గుమ్లాపూర్, రామడుగు, చల్లూరు, ఇల్లంతకుంటలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అవసరం మేరకు ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని దవాఖాన సూపరింటెండెంట్ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, డాక్టర్ నవీన పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలి
జిల్లాలో కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆయన వైద్యాధికారులు, ఎంపీడీవోలతో కొవిడ్ వ్యాక్సినేషన్పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెండో డోస్ 98.55 శాతం పూర్తయిందని, మిగతా వారికి త్వరగా వేయాలని ఆదేశించారు. ఇందుకోసం పీహెచ్సీల వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులంతా మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆదివారం వ్యాక్సినేషన్ చాలా బాగా చేపట్టారని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి డా. జువేరియా, పీహెచ్సీ వైద్యులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.