జమ్మికుంట, ఫిబ్రవరి 15: 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యాలను మరో 20 శాతం పెంచుకోవాలని, గతంలో కంటే సాధారణ ఖర్చులను తప్పనిసరిగా తగ్గించుకోవాలని వరంగల్ ఆర్జేడీ ఎం మల్లేశం, ఆర్డీడీఎం రాజు ఆదేశించారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్(కాటన్)లోని ‘ఈ-నామ్’ కార్యాలయంలో మంగళవారం ఆర్జేడీ, ఆర్డీడీఎంల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ల వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. సవరణ బడ్జెట్ను స్క్రూటినీ చేశారు. సమావేశానికి కరీంనగర్ డీఎంవో పద్మావతి, పెద్దపల్లి, సిరిసిల్ల డీఎంవో ప్రవీణ్, జగిత్యాల డీఎంవో ప్రకాశ్, డీఈఈ మునీందర్, ఏఈ రఘునాథ్తోపాటు 38 మార్కెట్లకు చెందిన 33 మంది కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక్కో జిల్లాలోని మార్కెట్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, అంచనాలు, సవరణ ప్రతులను పరిశీలించారు. ప్రతి జిల్లా డీఎంవో, కార్యదర్శులను ఆదాయ, వ్యయాలపై ప్రశ్నించారు. ఆడిట్ చేశారు. తర్వాత అధికారులు మాట్లాడారు. యేటా బడ్జెట్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయని, ఈ సంవత్సరం జమ్మికుంటలో నిర్వహించామని చెప్పారు. మార్కెట్ నిధులు అభివృద్ధి కోసం కేటాయించాలని, ప్రయారిటీ ప్రకారం ప్రతిపాదించిన పనులు చేయాలని చెప్పారు. మార్కెట్ నుంచి నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేసే వీలులేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడ్జెట్ రూపకల్పన ఉండాలని, నివేదిక ప్రకారమే ఖర్చులుండాలని చెప్పారు. మార్కెట్ల ఆదాయం గత మూడేళ్ల సరాసరిని పరిగణలోకి తీసుకున్నామని, అందుకనుగుణంగా లక్ష్యాలను నిర్ధేశించామని తెలిపారు. ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఇక్కడ మార్కెట్ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.