రాంనగర్, ఫిబ్రవరి 15: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు లేదన్నారు. సంసద్ ఆదర్శ్ యోజనలో మొదటి 10 స్థానాల్లో ఏడు గ్రామాలు తెలంగాణలో ఉండగా, మూడు గ్రామాలు కరీంనగర్ జిల్లా నుంచే ఎంపికయ్యాయని తెలిపారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించిందన్నారు. కరీంనగర్ను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మొదటి స్థానంలో నిలిపేందుకు సహకారం అందించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు యువత ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులపై ఉందన్నారు. వినియోగించే, సరఫరా చేసే వారి సమాచారం ఇస్తే పారితోషికం ఇస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా జాయింట్ కమిషనర్ కేవీ శాస్త్రి మాట్లాడుతూ.. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం తిమ్మాపూర్ మండలం పచ్చునూరు సర్పంచ్, కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుతూర్ సర్పంచ్ రమణారెడ్డి మాదకద్రవ్యాల నివారణకు సూచనలు చేశారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి వద్దు- ఆరోగ్యం ముద్దు అని ముద్రించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిషరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, సర్పంచులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.