కలెక్టర్ శశాంక
రాంనగర్, ఏప్రిల్ 19: త్వరలో జరుగనున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలు, ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కె శశాంక తెలిపారు. సోమవారం పద్మనగర్లోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో వారధి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఉచిత శిక్షణ తరగతులను పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా ఉధృతి ఎకువగా ఉన్నందున ఆన్లైన్ శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. పోలీస్శాఖలో పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఇతర ఉద్యోగ నియామకాలకు త్వరలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత పోలీస్శాఖలో ఉద్యోగావకాశాలు పొందుటకు వీలుగా ఆన్లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 320 మంది నిరుద్యోగ యువత ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఆన్లైన్ తరగతులు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కొనసాగుతాయని చెప్పారు. కరోనా ఉధృతి తగ్గిన అనంతరం ఆఫ్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగావకాశాలు మెరుగు పరుచుకోవాలని ఆకాంక్షించారు. సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాలకు పోటీ పరీక్షలు పకడ్బందీగా ఉంటాయని తెలిపారు. అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా సమకూర్చుతామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ జీ ఆంజనేయులు, వారధి సీనియర్ మేనేజర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.